భారత్-పాకిస్థాన్ విభజనే తేలిక.. బీజేపీతో సీట్ల కేటాయింపుపై శివసేన సెటైర్
హర్యానాతోపాటు మహారాష్ట్ర అసెంబ్లీకి షెడ్యూల్ విడుదలవడంతో పొత్తుల ఎత్తుల్లో ప్రధాన పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. మరాఠా గడ్డపై మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. తమ భాగస్వామ్యపక్షం శివసేనతో కలిసి బరిలోకి దిగుతామని సంకేతాలు ఇచ్చింది. కానీ సీట్ల విభజన మాత్రం కత్తిమీద సాములా మారింది.
చర్చలే ..
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచే బీజేపీ-శివసేన పార్టీ నేతలు సీట్ల పొత్తుపై చర్చలు జరుపుతున్నారు. కానీ సీట్ల కేటాయింపుపై మాత్రం స్పష్టత రాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ పరిధిలో 288 స్థానాలు ఉన్నాయి. మెజార్టీ స్థానాల్లో పోటీచేయాలని బీజేపీతోపాటు శివసేన కూడా భావిస్తోంది. అందుకోసమే సీట్ల కేటాయింపుపై చర్చలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది.
సీట్ల కన్నా ..
మహారాష్ట్రలో సీట్ల కేటాయింపు కొలిక్కిరాకపోవడంతో శివసేన నేత సంజయ్ రౌత్ అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ-శివసేన సీట్ల కేటాయింపు కన్నా భారత్ పాకిస్థాన్ విభజన తేలిక అని వ్యాఖ్యానించారు. అయితే తాము ప్రతిపక్ష స్థానంలో ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని .. కానీ అధికారంలో ఉండటంతో సీట్ల కేటాయింపు కోసం ఇరుపార్టీ నేతలు పట్టుబడుతున్నారని చెప్పారు.
130 సీట్లు కావాలట ..
మహారాష్ట్ర అసెంబ్లీ పరిధిలో 288 స్థానాలు ఉన్నాయి. అయితే శివసేన తాము 130 స్థానాల్లో పోటీ చేస్తామని భీష్మించుకొని కూర్చొవడంతో సమస్య తలెత్తింది. బీజేపీ-శివసేన భాగస్వామ్యపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 10 సీట్లను కోరుతుంది. ఈ క్రమంలో సీట్ల కేటాయింపు అంశం ఇరు పార్టీ నేతలకు సమస్యగా మారింది. ప్రస్తుతం అధికార బీజేపీ 122 స్థానాలు, శివసేన 63 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
వారికిచ్చి ..
మహారాష్ట్రలో తమ భాగస్వామ్య పక్షాలైన ఆర్పీఐ, ఇతర పార్టీలకు అడిగిన సీట్లను ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. కానీ శివసేన మాత్రం ఇందుకు విరుద్ధమైన వైఖరి అవలంభిస్తోంది. బీజేపీ-శివసేన చెరో 135 స్థానాల్లో పోటీ చేయాలని ప్రతిపాదిస్తోంది. మిగిలిన 18 స్థానాలను భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాలని సూచిస్తోంది. ఇందుకు బీజేపీ నేతలు అంగీకరించకపోవడంతో పీఠముడి నెలకొంది. ఇదివరకే 122 స్థానాల్లో గెలిచిన బీజేపీ .. మరిన్ని ఎక్కువ సీట్లలో పోటీచేయాలని భావిస్తోంది.
ఎక్కువ స్థానాలు ఎందుకంటే ..
ఎక్కువ సీట్లలో పోటీచేస్తే .. మెజార్టీ స్థానాలు వస్తాయని కమలనాథుల ఆలోచన. వారి వ్యుహన్ని ముందే పసిగట్టిన శివసేన .. చెరో సగం అని రాగం తీసింది. దీంతో సీట్ల సర్దుబాటు మరింత ఆలస్యమవుతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా అభ్యర్థుల ఎంపికపై ఇరుపార్టీల నేతలు తర్జనభర్జన పడ్డారు. తర్వాత మిగతా పార్టీల కన్నా ఆలస్యంగా క్యాండెట్లను ప్రకటించాల్సి వచ్చింది.