ఎన్నికలకు ముందు మత కల్లోలాలు చెలరేగవచ్చు..జర జాగ్రత్త
ముంబై: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న ఉగ్రవాద దాడులపై కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు, పార్టీలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో ఈ దాడులు జరగడం వెనుక తమకు అనేక సందేహాలు ఉన్నాయని, ఉద్దేశపూరకంగా ఈ దాడి జరిగి ఉండొచ్చని అంటూ పశ్చిమ బెంగాల్, ఏపీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీన్ని ఆధారంగా చేసుకుని శివసేన కూడా ఓ ప్రకటన చేసింది. బీజేపీని ఉద్దేశించి కాకుండా, అన్ని రాజకీయ పార్టీలు కూడా మత కల్లోలాలు, దాడులకు అవకాశం కల్పిస్తాయనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ దినపత్రిక సామ్నా లో ఓ కథనాన్ని ప్రచురించింది.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ-శివసేన మధ్య సీట్ల సర్దుబాటు కుదిరిన మరుసటి రోజే ఈ కథనం వెలువడింది. ఎన్నికల్లో రాజకీయ లబ్దిని పొందడానికి కొన్ని పార్టీలు మత కల్లోలాలకు పాల్పడవచ్చని, దాడులు చేయడానికి కుట్ర పన్నవచ్చని శివసేన పేర్కొంది. మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలను దృష్టిలో ఉంచుకుని శివసేన ఈ కథనం రాసినట్లు చెబుతున్నారు.
కొన్ని రాజకీయ పార్టీలు ఈ తరహా ఆలోచన చేయడానికి పుల్వామా ఉగ్రవాద దాడి ఆస్కారం ఇచ్చినట్టయిందని పేర్కొంది. పుల్వామా దాడుల అనంతరం పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలను శివసన తన కథనంలో పరోక్షంగా ఉటంకించింది. బీజేపీ ఎమ్మెల్యే నేపాల్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించింది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే..కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ది పొందడానికి ఎలాంటి ఘాతుకాలకైనా పాల్పడే ప్రమాదం లేకపోలేదని శివసన తన అనుమానాన్ని వ్యక్తం చేసింది.