ఎన్సీపీ-కాంగ్రెస్తో శివసేన డిస్కషన్స్, కొలిక్కొచ్చేనా: వైరి పక్షాల మధ్య పొత్తు పొడిచేనా..?
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్లి గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాలిస్తోన్న క్రమంలో.. ప్రభుత్వం ఏర్పాటుపై చర్చల ప్రక్రియ మొదలైంది. తమను బీజేపీ మోసం చేసిందని అంటోన్న శివసేన.. ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీతో చర్చల ప్రక్రియ ప్రారంభించింది.
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనే శరణ్యమా..? శివసేనకు గవర్నర్ మరో ఛాన్స్ ఇస్తారా...?
ఏం చేద్దాం..
శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే కాంగ్రెస్, ఎన్సీపీ నేతలతో సమావేశం అయ్యారు. ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో ఆ పార్టీ నేతలతో ఉద్దవ్ పొత్తులపై చర్చిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీచేశాయి. కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి బరిలోకి దిగాయి. ఒకవేళ తమతో శివసేన కలిసి వస్తే కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ముఖ్యమని ఆ పార్టీలు స్పష్టంచేస్తున్నాయి.
త్వరలో ప్రకటన..
కాంగ్రెస్-ఎన్సీపీ నేతలతో చర్చల ప్రక్రియ ప్రారంభమైందని ఉద్దవ్ మీడియాకు తెలిపారు. వివిధ అంశాలపై చర్చిస్తున్నామని.. పొత్తుపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్తో ఉన్న విభేదాలపై దృష్టిసారించామని ఉద్దవ్ చెప్పారు. శివసేన-ఎన్సీపీ నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వానికి డిమాండ్లపై ముందే చర్చిస్తామని ఉద్దవ్ చెప్పారు.
శివసేన అభ్యర్థే సీఎం
శివసేన అభ్యర్థి సీఎం పీఠం అధిష్టిస్తారని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. గుండె నొప్పితో లీలావతి ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఇవాళ డిశ్చార్స్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహారాష్ట్రలో త్వరలో ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. కానీ సీఎం పదవీ అభ్యర్థి మాత్రం శివసేన నుంచి మాత్రమే తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇందులో ఎలాంటి సందేహాం లేదన్నారు. పనిలోపనిగా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు.
ఇటు బీజేపీ
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాక.. రేపటినుంచి బీజేపీ మూడురోజుల పాటు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి గురించి ఎమ్మెల్యేలతో చర్చిస్తామని పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతోపాటు మధ్యంతర ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటే సిచుయేషన్ ఏంటీ అనే అంశంపై కూడా డిస్కస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.