దమ్ముంటే తప్పని నిరూపించండి: మోడీ ప్రభుత్వానికి శివసేన సవాల్
నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ అమలుపై విమర్శలు గుప్పిస్తూ బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాయడం దుమారం రేపింది.
న్యూఢిల్లీ/ముంబై: నోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ అమలుపై విమర్శలు గుప్పిస్తూ బిజెపి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాయడం దుమారం రేపింది.
ఈ వ్యాసం నేపథ్యంలో సొంత పార్టీ నేతల్లో కొందరు ఆయనపై మండిపడ్డారు. స్వయంగా తనయుడు, కేంద్రమంత్రి జయంత్ సిన్హా తన తండ్రి వ్యాఖ్యలు తప్పని చెప్పారు. మరోవైపు యశ్వంత్ సిన్హా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థించింది.
తాజాగా, యశ్వంత్ సిన్హాకు శివసేన మద్దతు పలికింది. ఆ వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పులేదని, కేంద్రానికి ధైర్యముంటే అవి తప్పని నిరూపించుకోవాలని సవాల్ విసిరింది.
మరోవైపు, దేశ ఆర్థికవ్యవస్థ గందరగోళంగా ఉందని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు సరిగా పని చేయడం లేదన్న యశ్వంత్ సిన్హా గురువారం మరోసారి స్పందించారు.
దేశ ఆర్థిక పరిస్థితిపై తాను చేసిన వ్యాఖ్యలు సరైనవేనని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు సరైనవేనని, దానిపై చర్చించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని, ఆర్థిక పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందన్నారు. జిఎస్టీకి తాను అనుకూలమే అన్నారు.
అయితే ప్రభుత్వం దాన్ని హడావుడిగా అమలు చేసిందని, ఆర్థిక పరిస్థితి క్షీణించడానికి ఇదే ప్రధాన కారణం అన్నారు. అంతేగాక అధికారంలో ఉంటూ గత ప్రభుత్వాలను విమర్శించడం సరికాదన్నారు.
అధికారంలోకి రాకముందు యూపీఏ ప్రభుత్వంపై తాము విమర్శలు చేశామని, కానీ ఇప్పుడు పదవిలోకి వచ్చి 40 నెలలు గడిచిందని, ఇప్పుడు కూడా గత ప్రభుత్వాలను నిందించడం సరికాదన్నారు.
రాజ్నాథ్, పియూష్ గోయల్కు ఆర్థిక వ్యవస్థపై తనకంటే మంచి అవగాహన ఉండొచ్చునని, అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ వెన్నుముకగా ఉందని వారు చెబుతున్న మాటలను తను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.