బెంగాల్లోనూ బీజేపీకి విలన్గా మారిన శివసేన...దీదీకి మద్దతు.. మమతే అసలైన బెంగాల్ టైగర్ అంటూ...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్నట్లు శివసేన ప్రకటించింది. అంతేకాదు,ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అసలైన బెంగాల్ టైగర్గా అభివర్ణించింది. దశాబ్దాలుగా బీజేపీతో ఉన్న స్నేహాన్ని వదులుకుని మహారాష్ట్రలో కమలానికి షాకిచ్చిన శివసేన... ఇప్పుడు మహారాష్ట్ర వెలుపల కూడా ఆ పార్టీకి విలన్గా మారుతుండటం గమనార్హం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ,రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ ఇప్పటికే టీఎంసీకి మద్దతు ప్రకటించగా... తాజాగా ఆ జాబితాలో శివసేన కూడా చేరినట్లయింది.
అందుకే మమతకు మద్దతు.. : శివసేన
నిజానికి బెంగాల్ ఎన్నికల్లో శివసేన పోటీ చేయవచ్చునని చాలామంది భావించారు. దీనిపై శివసే పార్టీలోనూ అంతర్గతంగా చాలానే చర్చ జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో శివసేన అక్కడ పోటీ చేయడం కంటే మమతకు మద్దతునివ్వడమే ఉత్తమమని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇదే విషయంపై శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ట్విట్టర్లో స్పందించారు. 'ఇప్పుడున్న పరిస్థితుల్లో... బెంగాల్లో ఫైట్ దీదీ వర్సెస్ ఆల్గా కనిపిస్తోంది. అన్ని 'M'లు.. మనీ,మందబలం,మీడియా 'M'మమతపై ప్రయోగించబడుతనున్నాయి. కాబట్టి శివసేన దీదీగా అండగా నిలబడాలని నిర్ణయించింది. దీదీ ఘన విజయం సాధించాలని శివసేన ఆకాంక్షిస్తోంది. ఎందుకంటే... ఆమె నిజమైన బెంగాల్ టైగర్.' అని చెప్పుకొచ్చారు.
శివసేన ఎందుకు పోటీ చేయట్లేదు...
గత నెల జనవరి 17న శివసేన ఒక ప్రకటన చేసింది. 'త్వరలోనే శివసేన కోల్కతా వస్తుంది' అని ప్రకటించింది. దీంతో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని చాలామంది భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తాము పోటీ చేసి ఓట్లు చీల్చితే అది బీజేపీకి మేలు చేసినట్లవుతుందని శివసేన భావించినట్లు తెలుస్తోంది. అందుకే పోటీ నుంచి తప్పుకుని మమతకు మద్దతునిచ్చినట్లు సమాచారం. శివసేన టీఎంసీకి ఇలా మద్దతు ప్రకటించిందో లేదో బీజేపీ నుంచి విమర్శల దాడి మొదలైంది.
శివసేనపై అప్పుడే బీజేపీ మాటల దాడి...
'జై శ్రీరామ్' అన్న నినాదం వింటేనే విసుగెత్తిపోయే మమతా బెనర్జీకి శివసేన మద్దతునివ్వడమేంటని బీజేపీ ఎంపీ మనోజ్ కొటక్ ప్రశ్నించారు. శివసేన కాగితపు పులి అని... అందుకే బెంగాల్లో పోటీ చేయట్లేదని ఎద్దేవా చేశారు. శివసేన హిందుత్వ భావజాలానికి చాలా దూరం జరిగిందని.. అందుకే మమతా బెనర్జీకి మద్దతునిచ్చిందని విమర్శించారు. మోదీ వ్యతిరేకులు ఇప్పుడు శ్రీరాముడి వ్యతిరేకులుగా కూడా మారిపోయారని మండిపడ్డారు. ఇక వారిని భగవంతుడే కాపాడాలని ఎద్దేవా చేశారు. కాగా,పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను 8 దశల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. మార్చి 27న మొదటి దశ పోలింగ్, ఏప్రిల్ 1న రెండో దశ పోలింగ్, ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్, ఏప్రిల్ 10న నాలుగో దశ పోలింగ్, ఏప్రిల్ 17న ఐదో దశ పోలింగ్, ఏప్రిల్ 22న ఆరో దశ పోలింగ్, ఏప్రిల్ 26న ఏడో దశ పోలింగ్, ఏప్రిల్ 29న చివరి దశ పోలింగ్ నిర్వహించనున్నారు. మే 2న ఫలితాలు వెల్లడిస్తారు.