మహారాష్ట్ర పీఠంపై శివసేన నజర్.. సీఎం అభ్యర్థి ఎవరంటే..?
ముంబై : మహారాష్ట్రలో ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ మిత్రపక్షమైన శివసేన తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యువ నాయకున్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.
రాజ్యసభాపక్షనేతగా దళిత నేత... కేంద్రమంత్రి థవార్చంద్ గెహ్లాట్కు దక్కిన అవకాశం
సీఎం అభ్యర్థిగా ఆదిత్య థాక్రే
అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ధీమాతో ఉన్న శివసేన ఈసారి అధికారం చేపట్టడం ఖాయమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రేను శివసేన సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ మరాఠీ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనలకు బలం చేకూర్చుతున్నాయి.
పోటీకి సయ్యంటున్న ఆదిత్య?
పొలిటికల్ ఎంట్రీకి ఆదిత్య సైతం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసే పనిలో బిజిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం అభ్యర్థిత్వంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఆచితూచి సమాధానమిచ్చారు. తన రాజకీయ అరంగేట్రానికి సంబంధించి తండ్రి ఉద్ధవ్ థాక్రేదే తుది నిర్ణయమని చెప్పారు. సీఎం అభ్యర్థిత్వంపై తాను ఇప్పుడే ఏం మాట్లాడలేదని, దీనిపై తర్వాత చర్చిద్దామని ఆదిత్య స్పష్టం చేశారు.
బీజేపీ సీఎం పోస్టు ఇస్తుందా?
ఇదిలా ఉంటే శివసేన ఐదేళ్లుగా బీజేపీతో అంటీ ముట్టనట్లు వ్యవహరించింది. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ పార్టీతో కలిసి పనిచేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ పొత్తు పెట్టుకోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అది నిజమైతే బీజేపీ సీఎం పదవి శివసేనకు ఇస్తుందా అన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్. నిజానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి పదవి మళ్లీ తమవారే చేపడతారని ధీమాతో ఉంది. తాజాగా జరిగిన పార్టీ కోర్ కమిటీ మీటింగ్లోనూ పార్టీ పెద్దలు కార్యకర్తలు ఇదే విషయం చెప్పారని బీజేపీ నేతలు అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆదిత్య థాక్రేను సీఎంగా చూడాలన్న శివసేన కల నిజమవుతుందా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.