ప్రభుత్వాన్ని నడిపేది మేమే అయినా.. నడిపించేది ఆయనే: శరద్ పవార్ ను ఆకాశానికెత్తేసిన శివసేన
ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం మూడు రోజుల్లోనే కుప్పకూలిపోవడం వెనుక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ చక్రం తిప్పినట్లు వార్తలు వెలువడుతున్న ప్రస్తుత తరుణంలో.. ఆయనను ఆకాశానికి ఎత్తేసింది శివసేన. శరద్ పవార్ తమ మార్గదర్శకుడిగా, దార్శనికుడిగా అభివర్ణించింది. ప్రభుత్వాన్ని నడిపేది తామే అయినప్పటికీ.. నడిపించేది మాత్రం శరద్ పవారేనని పేర్కొంది.
అజిత్ పవార్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్..నేతల్లో టెన్షన్: టచ్ లోనే ఉన్నారంటోన్న ఎన్సీపీ
సామ్నాలో ప్రత్యేక ఎడిటోరియల్..
శరద్ పవార్ మార్గదర్శకుడిగా అభివర్ణిస్తూ శివసేన మౌత్ పీస్ గా చెప్పుకొనే సామ్నా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఎడిటోరియల్ ను రాసింది. భిన్న ధృవాలను ఏకం చేయడంలో శరద్ పవార్ చూపిన చాణక్యం విస్మరించలేనిదని పేర్కొంది. హిందుత్వ సిద్ధాంతాలను అనుసరిస్తోన్న శివసేన, లౌకిక వాద పార్టీగా ముద్రపడిన ఎన్సీపీ, కాంగ్రెస్ లను ఒకే వేదిక మీదికి చేర్చడంలో శరద్ పవార్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారని ప్రశంసించింది.
శరద్ దాదా చాణక్యం వల్లే..
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ కూటమి సారథ్యంలో ఆవిర్భవించిన మహా వికాస్ అఘాడీ మరి కొన్ని గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోన్న విషయం తెలిసిందే. మహా వికాస్ అఘాడీ అధి నాయకుడిగా ఎన్నికైన శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ సహకారంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మూడు రోజుల్లోనే కుప్పకూలిపోవడంతో.. ఇది సాధ్యపడింది.
చరిత్ర విస్మరించిన పాత్ర..
మహా వికాస్ అఘాడీ ఆవిర్భావానికి శరద్ పవార్ చూపిన చొరవను సమీప భవిష్యత్తులో ఏ ఒక్క మహారాష్ట్రీయుడు విస్మరించబోరని సామ్నా పత్రిక తన ఎడిటోరియల్ లో పేర్కొంది. అపార రాజకీయ అనుభవం ఉన్న శరద్ దాదా.. మహారాష్ట్రలో ఓ నూతన శకం ఆవిర్భావానికి కారకుడయ్యారని కితాబిచ్చింది. అలాంటి మార్గదర్శకుడు చూపిన బాటలో మహారాష్ట్రలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం నడుస్తుందని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రపథంలో ఉంచేలా మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు చేయాల్సి ఉందని అభిప్రాయపడింది.
1947, ఆగస్టు 15 నాటి వాతావరణం..
ప్రస్తుతం మహారాష్ట్రలో స్వాతంత్య్ర దినోత్సవం నాటి పండగ వాతావరణం నెలకొందని సామ్నా పేర్కొంది. 1947 ఆగస్టు 15వ తేదీన దేశవ్యాప్తంగా ఎలాంటి స్వేచ్ఛాయువ వాతావరణం నెలకొని ఉందో.. సరిగ్గా అదే తరహా పరిస్థితులు, వాతావరణం ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొని ఉందని సామ్నా పేర్కొంది. హస్తినను కేంద్రంగా చేసుకుని పరిపాలన సాగిస్తోన్న నాయకులు ఎన్నో విధాలుగా,ఎన్నో రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినప్పటికీ.. ఉద్ధవ్ థాకరే తల వంచలేదని, అసలు సిసలు మరాఠా యోధుడికి ఉండాల్సిన సహజ లక్షణం అదేనని పేర్కొంది.