పొత్తు.. పొసగట్లేదా?: శివసేనకు విధేయుడి రాజీనామా: 21 సంవత్సరాలుగా థాకరే కుటుంబం వెంటే..
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చిన ఆనందంలో ఉన్న శివసేనకు పార్టీ విధేయుడొకరు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ తో చేతులు కలపడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ నాయకుడు రాజీనామా చేశారు. యువజన విభాగం కార్యదర్శి పదవి సహా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు. ఆయన పేరు- రమేష్ సోలంకి. శివసేనలో క్రియాశీలక నాయకుడు, యువజన విభాగం కార్యదర్శిగా పని చేశారు.
పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన బుధవారం ఉదయం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య థాకరేతో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడం తనకు నచ్చట్లేదని, పార్టీ సిద్ధాంతాలను మార్చుకోవడం బాధ కలిగిస్తోందని అన్నారు. సిద్ధాంతపరమైన విభేదాల వల్లే పార్టీని వీడాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు.
పార్టీ నుంచి బయటికి వచ్చినప్పటికీ.. దివంగత నాయకుడు బాల్ థాకరే అభిమానిగా కొనసాగుతానని అన్నారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 21 సంవత్సరాలుగా తాను శివసేన కుటుంబంలో ఒకరిగా కలిసిపోయానని, సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగానని అన్నారు. ఆదిత్య థాకరేతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారి కుటుంబంలో ఒకరిగా మెలిగానని, అయినప్పటికీ.. కాంగ్రెస్ తో చేతులు కలపడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని రమేష్ సోలంకి చెప్పారు.
భారతీయ జనతా పార్టీతో పార్టీ నాయకత్వం తెగదెంపులు చేసుకున్న ఘటన కూడా తనను ఇంతగా బాధించలేదని అన్నారు. లౌకికవాద పార్టీ పేరుతో హిందూయిజానికి వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటున్న కాంగ్రెస్ తో శివసేన పొత్తు పెట్టుకోవడం తనను తీవ్ర ఆశ్చర్యానికి, బాధకు గురి చేసిందని అన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కంటే కాంగ్రెస్ ప్రమాదకరమని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తాను శివసేనలో కొనసాగదలచుకోలేదని చెప్పారు.