బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో శివసేన... 50 స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్...
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కూడా పోటీ చేస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్. దాదాపు 50 సీట్లలో శివసేన అభ్యర్థులను నిలిపే యోచనలో ఉన్నట్లు తెలిపారు. బిహార్ ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే,మంత్రి ఆదిత్య థాక్రే వర్చువల్ ర్యాలీల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు.
బిహార్ ఎన్నికల కోసం శివసేన ఇప్పటికే 20 మంది స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను విడుదల చేసింది. ఉద్దవ్ థాక్రే,ఆదిత్య థాక్రేలతో పాటు రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్,ప్రియాంక చతుర్వేది,అనిల్ దేశాయి,లోక్సభ ఎంపీలు కృపాల్ తుమానే,అరవింద్ సావంత్,వినాయక్ రౌత్,మాజీ చంద్రకాంత్ ఖైరే,మంత్రులు గులాబ్ రావ్ పాటిల్,సుభాష్ దేశాయి ఈ జాబితాలో ఉన్నారు.బిహార్లోనూ పార్టీని విస్తరించాలన్న యోచనలో ఉన్న శివసేన ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది.
సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడంలో కీలక వ్యవహరించి... ఆ తర్వాత జేడీయూలో చేరిన బిహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండేపై కూడా అభ్యర్థిని నిలబెడుతామని శివసేన ఇదివరకే ప్రకటించింది.
కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ఆదిత్య థాక్రే టార్గెట్గా మారిన నేపథ్యంలో బిహార్లో శివసేన ఎన్నికల బరిలో దిగడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర సర్కార్ సమర్థవంతమైన చర్యలతో కరోనా వైరస్ను ఎదుర్కోవడంతో... దాన్ని తట్టుకోలేక ఇలా తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆదిత్యా తనపై వస్తున్న ఆరోపణలను గతంలోనే తిప్పికొట్టారు. సుశాంత్ మరణం తననూ దిగ్భ్రాంతికి గురిచేసిందని... అయితే ఆ కేసుతో తనకెలాంటి సంబంధం లేదన్నారు.
Recommended Video
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్లో అక్టోబర్ 28,నవంబర్ 3,నవంబర్ 7 తేదీల్లో మూడు దశల్లో అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఫలితాలు వెలువడుతాయి.