ఉద్ధవ్ను కలిసేందుకు వచ్చిన అమిత్ షాకు శివసేన షాక్, మాధురీ దీక్షిత్తో బీజేపీ చీఫ్ భేటీ
ముంబై: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు శివసేన అధినేత ఉద్దవ్ థాకరేను కలవడానికి ముందు ఆ పార్టీ పత్రిక సామ్నా షాకిచ్చింది. 2019 ఎన్నికల ముందు బీజేపీతో ఎటువంటి పొత్తు ఉండదని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.
ఇటీవలే జరిగిన మహారాష్ట్రలోని పాల్ఘర్ ఉప ఎన్నికలో పార్టీ పనితీరును ప్రస్తావిస్తూ ఈ పోలింగ్ ఫలితాలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరి పోస్టర్ కూడా తమకు అవసరం లేదని స్పష్టం చేశాయని అభిప్రాయం తెలియజేసింది. ఇరు పార్టీల అగ్రనేతల భేటీకి ముందు సామ్నా సంపాదకీయం రూపంలో శివసేన తన విధానం ఏంటో పరోక్షంగా తెలియజేసింది.
సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో దేశవ్యాప్తంగా పలు వర్గాలు, పార్టీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ అధ్యక్షులు అమిత్ షా కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే షా ఈ రోజు బాలీవుడ్ బ్యూటీ మాధురీదీక్షిత్ను సైతం ముంబైలో కలిశారు. సామ్నా సంపాదకీయం ఈ కార్యక్రమాన్ని సైతం తప్పుబట్టింది.
మాధురీ దీక్షిత్తో అమిత్ షా భేటీ
అమిత్ షా బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్, ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ మాధవ్లను కలిశారు. సంపర్క్ ఫర్ సమర్థన్ ప్రచారంలో భాగంగా వారితో సమావేశమయ్యారు. షాతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు. మోడీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన రిపోర్టు కార్డును వారికి అందించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మద్దతు కూడగట్టేందుకు అమిత్ షా ఈ ప్రచారం చేపట్టారు. దేశవ్యాప్తంగా పలువురు వ్యక్తులను కలిసి బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన వారందరి ఆశీర్వాదాలు ఇప్పుడు కూడా తమకు ఉండాలని బీజేపీ అధిష్ఠానం కోరుకుంటోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ నేతలు వారిని కలిసి భాజపా ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తున్నారు. సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా ఉద్దవ్ థాకరే, రతన్ టాటా, లతా మంగేష్కర్ తదితరులను కలుస్తారు.