మాటల్లో కాదు చేతల్లో చూపండి.. అలీగఢ్ ఘటనపై శివసేన ఆగ్రహం..
ముంబై : ఉత్తరప్రదేశ్ అలీగఢ్లో రెండున్నరేళ్ల చిన్నారి పాశవిక హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో చిన్నారుల రక్షణ విషయంలో యోగి సర్కారు ఘోరంగా విఫలమయిందంటూ శివసేన అధికారిక పత్రిక సామ్నా ఓ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది.
కథువా కేసులో కీలక తీర్పు.. ఆరుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం..
యోగి ప్రభుత్వంపై ఆగ్రహం
బేటీ బచావో నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీ సర్కారు... మాటల్లో కాకుండా చేతల్లో ఆ పని చేసి చూపాలని శివసేన డిమాండ్ చేసింది. యూపీ ప్రభుత్వానికి అలీగఢ్ ఘటన మాయని మచ్చలా మిగిలిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సామ్నాలో రాసిన వ్యాసంలో శివసేన నిర్భయ ఘటనను ప్రస్తావించింది. 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అప్పుడు ఆందోళన చేసినవారే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారు. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పురాలేదని, ముఖ్యంగా యూపీలో చిన్నారులపై ఆత్యాచారాలు మరింత పెరిగాయని సామ్నా ఆరోపించింది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దారుణమన్న శివసేన.. చిన్నారులకు రక్షణ కల్పించేందుకు యోగి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
క్రూరంగా హింసించి చిన్నారి హత్య
ఉత్తర్ప్రదేశ్లోని టప్పల్కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి మే 30న అదృశ్యమైంది. మూడు రోజుల అనంతరం జూన్ రెండున బాలిక మృతదేహం చెత్తకుప్పలో దొరికింది. చిన్నారి తండ్రి భన్వారీలాల్ తన వద్ద తీసుకున్న రూ.10వేల అప్పు తీర్చలేదన్న అక్కసుతో జహీద్ అనే వ్యక్తి అస్లాంతో కలిసి చిన్నారిని క్రూరంగా హింసించి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
కన్న బిడ్డపైనే అత్యాచారం
ముక్కుపచ్చలారని చిన్నారిని దారుణంగా హత్యచేసిన నిందితుల్లో ఒకడైన జహీద్పై సొంత కూతురుపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసు నడుస్తోంది. 2014లో ఏడేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ దుర్మార్గుడు ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నారి హత్యతో కలిపి ఇప్పటి వరకు అతనిపై నాలుగు కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితులపై ఇప్పటికే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇద్దరు ఎస్పీల నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు యూపీ సర్కారు ప్రకటించింది.