షేక్హ్యాండ్ ఇస్తానని కత్తితో దాడి, ఎన్నికల ర్యాలీలో దుండగుడి బీభత్సం..
మరో నాలుగురోజుల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్థులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సభలు, ర్యాలీలో పాల్గొంటూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు. అయితే ఇవాళ శివసేన ఎంపీ ఓమ్రాజే నింబల్కర్ కూడా ప్రచారం చేశారు. కానీ ఓ దుండగుడు కత్తీతో బీభత్సం సృష్టించడంతో ర్యాలీ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉస్మానాబాద్ జిల్లా పడోలి నైగాన్ వద్ద శివసేన ర్యాలీ తీస్తోంది. ర్యాలీలో ఎంపీ ఓమ్రాజే నింబల్కర్ పాల్గొన్నారు. ఆశేష జనవాహినిని ఉద్దేశించి ముందుకుసాగుతున్నారు. ఇంతలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ర్యాలీ వద్దకొచ్చాడు. షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సాధారణంగా ర్యాలీల్లో జనం వచ్చి నేతలతో చేతులు కలుపుతుంటారు. ఎప్పటిలాగే కార్యకర్త వచ్చి ఉంటాడని ఓమ్రాజే భావించారు. కానీ క్షణకాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
అప్పటికే తనతో తీసుకొచ్చిన కత్తితో దుండగుడు దాడికి తెగబడ్డాడు. ఓమ్రాజే చేతి మణికట్టుపై కత్తితో పొడిచాడు. ఇంతలో అనుచరులు అతనిని పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఓమ్రాజ్ చేతికి వాచీ ఉండటం కూడా ప్రమాదం తీవ్రత తగ్గడానికి మరో కారణమైంది. ఈ విషయాన్ని మీడియాకు ఓమ్రాజే తెలిపారు. ఓమ్రాజే కుటుంబానికి శత్రువుల నుంచి ప్రాణహాని ఉంది. ఓమ్రాజే తండ్రి పవన్రాజే 2006లో హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పవన్రాజేను ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వేలో దుండగులు కాల్చిచంపారు. ఈ హత్య కసులో మాజీ ఎంపీ పదన్సిన్హ్ పాటిల్ కీలక సూత్రధారిగా అభియోగాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.