భిన్నధృవాలు: సోనియాతో శివసేన ఎంపీల భేటీ: తొలిసారిగా.. మహా రాజకీయాలపై
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న తాజా పరిణామాలు ఓ సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీశాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గానీ, శాశ్వత శతృవులు గానీ ఉండరనే విషయాన్ని మరోసారి ప్రస్ఫూటింపజేశాయి. భిన్న ధృవాలు పరస్పరం చేతులు కలపడానికి దారి తీశాయి. లౌకికవాద పార్టీగా ముద్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మతతత్వ పార్టీగా పేరున్న శివసేనలు కలుసుకోవడమే దీనికి నిదర్శనమని అంటున్నారు విశ్లేషకులు.
మహారాష్ట్ర నుంచే బీజేపీ పతనం: కూటమికి సమాజ్ వాది పార్టీ బేషరతు మద్దతు
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీతో శివసేన లోక్ సభ సభ్యులు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ-అజిత్ పవార్ వర్గాన్ని గద్దె దింపడానికి, అధికారాన్ని దూరం చేయడానికీ శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- కాంగ్రెస్ కూటమి కట్టిన నేపథ్యంలో.. దేశ రాజకీయాలపైనా దాని ప్రభావం చూపుతోంది.
శివసేన లోక్ సభ సభ్యులు అనిల్ దేశాయ్, గజానన్ కీర్తికర్, అరవింద్ సావంత్, రాహుల్ షెవాలే.. సోమవారం దేశ రాజధానిలో సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. మహారాష్ట్రలో నెలకొన్న తాజా పరిణామాలను సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తరువాత శివసేన లోక్ సభ సభ్యులు.. సోనియాగాంధీతో సమావేశం కావడం ఇదే తొలిసారి. దీనితో అందరి దృష్టీ ఈ భేటీపైనే నిలిచింది.
దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలో ఏర్పాటైన భారతీయ జనతా పార్టీ-అజిత్ పవార్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మాజీమంత్రి అరవింద్ సావంత్ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం నిర్ణయానుసారం తాను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. కేంద్రమంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన అరవింద్ సావంత్ ను ఈ సందర్భంగా సోనియాగాంధీ అభినందించినట్లు తెలుస్తోంది.
కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ నుంచి ఎలాంటి పరిస్థితుల్లో శివసేన బయటికి రావాల్సి వచ్చిందనే విషయాన్ని వారు సోనియాగాంధీకి వివరించారు. 30 సంవత్సరాలుగా తాము బీజేపీతో కలిసే ఉన్నామని, ప్రతి ఎన్నికనూ ఉమ్మడిగా ఎదుర్కొన్నామని తెలిపారు. అయినప్పటికీ.. ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడానికి తాము ప్రతిపాదించిన 50-50 ఫార్ములాను బీజేపీ నాయకులు నిర్ద్వందంగా తోసి పుచ్చారని అన్నారు.
దీనిపై సోనియాగాంధీ స్పందించారు. త్వరలోనే పరిస్థితులన్నీ సర్దుకుంటాయని, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని వారికి సూచించినట్లు తెలుస్తోంది. సంకీర్ణ కూటమి ప్రభుత్వం సుస్థిర పాలనను అందిస్తుందని సోనియాగాంధీ జోస్యం చెప్పినట్లు సమాచారం.