కలగూర గంప కూటమి: శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సర్కార్ ఆయువు ఏడెనిమిది నెలలే: కేంద్రమంత్రి
రాంచీ: మహారాష్ట్రలో అధికారాన్ని అందుకోవడానికి శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమిపై ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మరి కొన్ని గంటల్లో కీలక ప్రకటన వెలువడబోతోంది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న మహారాష్ట్రలో ఏ క్షణంలోనైనా శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ప్రస్తుతం పదవుల పంపకాలపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి ఆ మూడు పార్టీల మధ్య. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రివర్గం కూర్పు సహా అన్ని రకాల పదవులపైనా ఏకధాటిగా చర్చలు నడుస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రకే చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన చేశారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపలేదని తేల్చి చెప్పారు. ఏడెనిమిది నెలల్లోనే కుప్పకూలిపోతుందని జోస్యం చెప్పారు. 2020 నాటికి మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని, లేదా తామమే అధికాారాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం ఆయన జార్ఖండ్ లో పర్యటిస్తున్నారు. వివిధ జిల్లాల్లో బీజేపీ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షో, ఇతర కార్యక్రమాల్లో నితిన్ గడ్కరీ విస్తృతంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తిరుగులేని శక్తిగా బీజేపీ ఆవిర్భవిస్తుందని అన్నారు. జార్ఖండ్ లో వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోందని చెప్పారు.
మహారాష్ట్ర రాజకీయాలపై గడ్కరీ మాట్లాడుతూ.. శివసేన మోసం చేయడం వల్ల తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామని అన్నారు. అధికార దాహంతో శివసేన పార్టీ తమతో తెగదెంపులు చేసుకుందని, తమ సిద్ధాంతాలకు వ్యతిరేంగా ఎన్సీపీ, కాంగ్రెస్ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుంటోందని విమర్శించారు. శివసేన సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటువుతుందో? లేదో తనకు తెలియదని చెప్పారు.
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మహారాష్ట్రలో ఏర్పాటైనప్పటికీ.. ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదని అన్నారు. ఏడెనిమిది నెలల్లోనే కుప్పకూలిపోతుందని చెప్పారు. సిద్ధాంతపరమైన విభేదాలు తలెత్తడం ఖాయమని అన్నారు. ఈ విభేదాలతో పరస్పరం కలహించుకుంటూ పరిపాలన సాగిస్తారని, అది ఎంతో కాలం నిలవదని చెప్పారు. అధికారాన్ని ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే దాని దుష్పరిణామాలను మహారాష్ట్ర ప్రజలు చవి చూస్తారని అన్నారు. వారి ఆగ్రహానికి సంకీర్ణ కూటమి ప్రభుత్వం బలి అవుతుందని చెప్పారు.