సంపన్న ప్రాంతీయ పార్టీగా అవతరించిన శివసేన: ఏజీపీ, జేడీఎస్కు పెరిగిన విరాళాలు
న్యూఢిల్లీ: అత్యంత సంపన్న ప్రాంతీయ రాజకీయ పార్టీగా శివసేన అవతరించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రాంతీయ పార్టీల కంటే శివసేనకు అత్యధిక విరాళాలు సమకూరాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది.
శివసేన టాప్
ఎన్నికల కమిషన్కు రాజకీయ పార్టీలు సమర్పించిన రికార్డులను విశ్లేషించిన మీదట ఈ నివేదికను ఏడీఆర్ రూపొందించింది. మహారాష్ట్రకు చెందిన శివసేన 297 విరాళాల నుంచి రూ 25.65 కోట్లు స్వీకరించింది.
ఆప్ సెకండ్
ఇక రూ24.73 కోట్ల విరాళాలతో ఆప్ తదుపరి స్ధానంలో నిలించింది. పంజాబ్కు చెందిన శిరోమణి అకాలీ దళ్ రూ 15.45 కోట్ల విరాళాలు రాబట్టి మూడో స్థానంలో నిలిచిందని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇక ప్రాంతీయ పార్టీలు 6,339 విరాళాల నుంచి మొత్తం రూ 91.37 కోట్ల మొత్తం సమీకరించాయి. ఇందులో రూ 65.83 కోట్లు శివసేన, ఆప్, శిరోమణి అకాలీదళ్లకే దక్కాయి. నగదు విరాళాల్లో రూ 72.7 లక్షలతో అసోం ప్రధమ స్ధానంలో నిలవగా,రూ 65 లక్షలతో పుదుచ్చేరి తదుపరి స్ధానంలో ఉంది. అత్యధిక విరాళాలు రూ 20.86 కోట్లు ఢిల్లీ నుంచి సమకూరగా, 19.7 కోట్లు మహారాష్ట్ర నుంచి రూ 9.42 కోట్లు పంజాబ్ నుంచి సమకూరాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది.
ఏజీపీ, జేడీఎస్కు పెరిగిన విరాళాలు
అయితే, శివసేనకు 2015-16లో వచ్చిన రూ.61.19కోట్ల కంటే ఇప్పుడు 70శాతం విరాళాలు తగ్గిపోవడం గమనార్హం. ఇదే సమయంలో అస్సాంకు చెందిన అసోమ్ గణ పరిషద్(ఏజీపీ), కర్ణాటకకు చెందిన జేడీ(సెక్యూలర్) అత్యధిక విరాళాలు దక్కించుకున్నాయి. ఏజీపీ రూ.0.43కోట్లు సేకరించి 7,183శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత ఏడాది జేడీఎస్ రూ.4.2కోట్లు సేకరించి 596శాతం పెరుగుదల నమోదు చేసింది.
ఆ రెండు పార్టీలు అధికారంలోకి..
ఆసక్తికరంగా ఈ రెండు పార్టీలు(ఏజీపీ, జేడీఎస్) ఆయా రాష్ట్రాల్లో చాలా ఏళ్ల తర్వాత ఇటీవలే అధికారంలోకి వచ్చాయి. బీజేపీతో కలిసి పోటీ చేసి గెలిచి 2016లో అస్సాంలో ఆ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. జేడీఎస్ కూడా కాంగ్రెస్ తో కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కాగా, రాజకీయ పార్టీలు రూ 20,000 మించిన విరాళాల వివరాలను వెల్లడించాలని, ఫామ్ 24ఏని పూర్తిగా నింపాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.