బీజేపీతో పొత్తే కొంపముంచింది.. అంతా నాశనం : ఉద్దవ్ థాక్రే
ముంబై : బీజేపీతో పొత్తు వల్లే నిండా మునిగాం అంటున్నారు శివసేన అధ్యక్షుడు ఉద్దవే థాక్రే. 25 ఏళ్ల నుంచి బీజేపీతో కొనసాగిన మిత్రుత్వం వల్లే పార్టీ ఢీ లా పడిపోయిందని.. పొత్తుల వ్యవహారం లేకుండా సోలో గానే ముందుకెళ్లుంటే ఈపాటికి అధికారంలోకి వచ్చేవారమని వ్యాఖ్యానించారు ఉద్దవే థాక్రే.
శివసేన పార్టీ అధికార పత్రికలైన సామ్నా మరాఠీ, దోపహర్ కా సామ్నా హిందీ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఉద్దవ్ థాక్రే. మంగళవారం నాడు 56వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా పార్టీ అధికార పత్రికలకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు ఉద్దవ్ థాక్రే. ఇకపోతే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీజేపీతో పొత్తును శివసేన తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. 'దాదాపు రెండు తరాలు.. 25 ఏళ్ల పాటు బీజేపీతో పొత్తును కొనసాగించడం వల్ల పార్టీ నాశనమైంది. సొంతబలాన్నే నమ్ముకుని ఉంటే ఎప్పుడో అధికారం సాధించేవాళ్లం' అని పేర్కొన్నారు థాక్రే. అయితే భావజాల ఐక్యతలో భాగంగానే జాతీయవాద దృక్పథంతో బీజేపీ పొత్తుకు బాల్ థాక్రే స్నేహ హస్తం చాచారని అన్నారు ఉద్దవ్ థాక్రే. ఇందులో ఎలాంటి ప్రేరేపణలకు తావు లేదని, బాల్ థాక్రే ఎప్పుడూ అధికారం కోసం పాకులాడ లేదన్నారు.