బాబు దీక్షకు కమల్నాథ్, శివసేన, ఆ బీజేపీ ఎంపీల మద్దతు, లోకసభలో బుట్టా, రామ్మోహన్ నిప్పులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేస్తున్న దీక్షకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ మద్దతు పలికారు. చంద్రబాబు, కమల్ నాథ్లు పరస్పరం ప్రశంసించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో వైసీపీతో తమతో కలిస్తే మంచిదేనని చెప్పారు. ఒకటి రెండు ఎంపీ సీట్లు వైసీపీ గెలిచినా మాతో కలిసి వస్తే తప్పేమీ లేదన్నారు.
బీజేపీ అసమ్మతి నేతల మద్దతు
బీజేపీ అసమ్మతి నేతలు యశ్వంత్ సిన్హా, శతృఘ్ను సిన్హాలు కూడా మద్దతు పలకనున్నారు. సంఘీభావం తెలిపేందుకు వారు ఏపీ భవన్కు వచ్చారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా మద్దతు పలికారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తదితరులు మద్దతు పలికారు.
లోకసభలో బుట్టా రేణుక
ఏపీలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించాలని ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. అమరావతికి కేంద్రం నుంచి ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పారు. కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పారు. రాయలసీమలో రెండేళ్లుగా తీవ్రమైన కరువు ఉందని చెప్పారు. కరువు ప్రాంతాలకు ప్రత్యేక సాయం ప్రకటించాలన్నారు. వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులకు సాయం చేయాలన్నారు. కులవృత్తులు చేసుకునే వారికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని చెప్పారు.
ఏపి భారతదేశంలో భాగం కాదా : హమీలు అమలు చేయాలి : దీక్షకు మన్మోహన్-రాహుల్-ఫరూక్ మద్దతు..
దేశమంటే మనుషులని గుర్తుంచుకోవాలి
ఓ వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ధర్మ పోరాట దీక్ష చేస్తుంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోకసభలో నిరసన గళం విప్పారు. కేంద్రం ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ రైల్వే జోన్ పైన ఇప్పటికీ ప్రకటన చేయలేదన్నారు. ఏపీకి అన్నీ చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. మోడీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చెప్పారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ మాటలకే పరిమితమైందన్నారు. దేశమంటే మట్టికాదు.. మనుషులన్న విషయం గుర్తుకు ఉంచుకోవాలని హితవు పలికారు.