క్లైమాక్స్ కు చేరిన మహా ఎపిసోడ్: అస్వస్థతకు గురైన సంజయ్ రౌత్: కంటిమీద కునుకు లేకుండా..ఆసుపత్రిలో
ముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఎట్టకేలకు శివసేనకు ఆహ్వానించిన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శివసేనకు మద్దతు ఇచ్చేలా అడుగులు వేస్తున్నాయి కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ). సోమవారం సాయంత్రానికి మహారాష్ట్ర ఎపిసోడ్ కు తెర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో ఒక్కటే: మాలెగావ్ లో మజ్లిస్ లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో..!
కంటి మీద కునుకు లేకుండా..
ఈ పరిస్థితుల్లో శివసేన సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్ అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ శివసేనను ఆహ్వానించిన నేపథ్యంలో..అటు ఎన్సీపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్ర నాయకులతో నిరంతరాయంగా ఆయన సంప్రదింపులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి బాగా పొద్దు పోయేంత వరకూ ఆయన శివసేన నాయకులతో కాంగ్రెస్, ఎన్సీపీ నేతలతో మంతనాలు నిర్వహిస్తూ గడిపారు. ఫలితంగా ఈ మధ్యాహ్నం ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ప్రతిష్ఠాత్మక లీలావతి ఆసుపత్రికి తరలించారు.
స్వల్పంగా గుండెనొప్పి..
సంజయ్ రౌత్ అస్వస్థత పట్ల ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని, నిద్ర లేకుండా గడపటం వల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయని డాక్టర్లు వెల్లడించినట్లు చెబుతున్నారు. విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సంజయ్ రౌత్ ఆసుపత్రిలో చేరిన సమాచారాన్ని అందుకున్న వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. స్వల్పంగా గుండెనొప్పి సంభవించినట్లు డాక్టర్లు వెల్లడించారని సంజయ్ రౌత్ సోదరుడు, విఖ్రోలి శాసనసభ్యుడు సునీల్ రౌత్ తెలిపారు.
రెండోదఫా గుండె నొప్పి..
ఇదివరకే ఓ సారి గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారని, తాజాగా మరోసారి అదే పరిస్థితి తలెత్తిందని సునీల్ రౌత్ చెప్పారు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు, వర్లీ శాసన సభ్యుడు ఆదిత్య థాక్రే వెంటనే సంజయ్ రౌత్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ మహారాష్ట్రలో రోజూ వినిపిస్తోన్న పేరు సంజయ్ రౌత్. మిత్రపక్షం భారతీయ జనతాపార్టీకి ప్రతిపాదించిన 50-50 ఫార్ములా ఆరంభం నుంచీ ఆయన పట్టువదల్లేదు. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవాలనే ఏకైక డిమాండ్ కు కట్టుబడిా ఉన్నారు. బీజేపీ తెగదెంపులకు దిగినప్పటికీ.. ఆయన వెనుకంజ వేయలేదు. బీజేపీ వైఖరిని ఎండగడుతూ శివసేన సొంత పత్రిక సామ్నాలో రోజూ వ్యాసాలు రాస్తూ వచ్చారు.