షాకింగ్: మహా సీఎం రేసులో సంజయ్ రౌత్: ఉద్ధవ్ కు వద్దనుకుంటే.. ఇక ఆయనే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు శుక్రవారం అనూహ్యంగా మలుపు తిరిగాయి. శివసేన అధికార పీఠానికి అత్యంత చేరువగా వెళ్తున్న కొద్దీ.. షాకింగ్ ట్విస్టులు వెలుగులోొకి వస్తున్నాయి. తమకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో కలిసి ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవడానికి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మనస్ఫూర్తిగా అంగీరించట్లేదని తెలుస్తోంది.
మేమంతా కలిసే ఉన్నాము... పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిపై శివసేన క్లారిటి
ఉద్ధవ్.. వద్దనుకుంటే
ముఖ్యమంత్రిగా పనిచేయాల్సి ఉంటే అయిదేళ్ల పూర్తి కాలాన్ని శివసేనకే కేటాయించాల్సి ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఎన్సీపీతో కలిసి ముఖ్యమంత్రి పదవిని గనక పంచుకోవడం అనివార్యమనుకుంటే.. ఆ పదవే తనకు వద్దని ఉద్ధవ్ థాకరే పార్టీ ముఖ్య అనుచరుల వద్ద వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎన్సీపీతో కలిసి ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవడం అనివార్యమే అయితే.. ఉద్ధవ్ థాకరేకు ప్రత్యామ్నాయంగా సంజయ్ రౌత్ పేరును ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏక్ నాథ్ షిండే.. సహా
సంజయ్ రౌత్ తో పాటు శివసేన సభా పక్ష నాయకుడు ఏక్ నాథ్ షిండే, సావంత్ వంటి పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ.. ఎక్కువ మంది శాసన సభ్యులు సంజయ్ రౌత్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఉద్ధవ్ థాకరేకు ప్రత్యామ్నాయంగా శివసేనకు అత్యంత విధేయులైన వారిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాల్సి ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంజయ్ రౌత్ కు మించిన విధేయులు మరొకరు లేరనే అభిప్రాయాలు శివసేన ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తోసిపుచ్చుతోన్న సంజయ్ రౌత్..
ఈ వార్తలను సంజయ్ రౌత్ తోసి పుచ్చుతున్నారు. అలాంటిదేమీ ఉండబోదని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయిదేళ్ల పాటు శివసేన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటారని కరాఖండిగా తేల్చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాననే వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. ఎన్సీపీతో కలిసి ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవిడం ఉద్ధవ్ థాకరేకు ఇష్టం లేదని సంజయ్ రౌత్ వెల్లడించారు. అనివార్య పరిస్థితులు ఏవైనా ఎదురు కావడం, ముఖ్యమంత్రి పదవిని అందుకోవడానికి ఉద్ధవ్ థాకరే విముఖత వ్యక్తం చేయాల్సి వస్తే.. అప్పుడు ప్రత్యామ్నాయాన్ని అన్వేషిస్తామని సంజయ్ రౌత్ చెప్పారు.
డీల్ పై మరి కొన్ని గంటల్లో క్లారిటీ..
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ చేస్తోన్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ మూడు పార్టీల మధ్య రూపొందిన 40 పాయింట్ల కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్)పై తుది చర్చలు నడుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రానికి ఈ మూడు పార్టీల మధ్య అంగీకారం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు, అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి ఛైర్మన్ సహా మంత్రివర్గ కూర్పుపై విస్తృత చర్చలు ప్రస్తుతం నడుస్తున్నాయి. మరి కొన్ని గంటల్లో స్పష్టత రావడం ఖాయంగా కనిపిస్తోంది.