బీజేపీ రాజకీయాలు దేశాన్ని ముంచుతాయి: శివసేన ఆగ్రహం
ముంబై: భారతీయ జనతా పార్టీ పైన ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన మండిపడింది. బీజేపీ రాజకీయాలు దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని శివసేన పార్టీ అధ్యక్షులు ఉద్దవ్ థాకరే ధ్వజమెత్తారు. ముఫ్తీ మొహమ్మద్ సయీద్తో కుమ్మక్కై జమ్మూ కాశ్మీర్లో అధికారం కైవసం చేసుకోవడానికి ఆడిన రాజకీయాలు సరికాదన్నారు.
పీడీపీతో పొత్తు బీజేపీతో పాటు దేశాన్ని నట్టేట ముంచుతాయని హెచ్చరించారు. ఆదివారం ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయం రాసింది. అందులో బీజేపీ పైన నిప్పులు చెరిగింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నిక్లలో పాకిస్తాన్, ఉగ్రవాదులు సహకరించారని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి దేశ ప్రజలను అవమానించారన్నారు.
అఫ్జల్ గురు అవశేషాలు కోరిన పీడీపీ దేశద్రోహానికి పాల్పడిందన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రధాని మోడీ పార్లమెంటులో ఖండించాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ - పీడీపీ ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రయత్నించిన రామ్ మాదవ్.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను అడ్డుకోలేకపోతున్నారన్నారు.