కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ టాప్.. మోదీ వైఫల్యంతో ఇది తథ్యమంటూ శివసేన ఫైర్..
''అంతపెద్ద మహాభారత యుద్ధమైనా 18 రోజుల్లో ముగిసింది. మన ప్రధాని మోదీగారేమో కరోనాపై యుద్ధాన్ని 21 రోజుల్లోనే గెలుస్తామని చెప్పారు. కానీ నేటికి 110 రోజులైనా మోదీగానీ, కేంద్ర సర్కారుగానీ ఏమీ చేయలేకపోయారు. ఈ మహమ్మారి 2021దాకా కొనసాగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మోదీ వైఫల్యం కారణంగా కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ నంబర్ వన్ అయితీరేలా ఉంది'' అంటూ మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన అనూహ్య వ్యాఖ్యలు చేసింది.
స్వప్న సురేష్.. సెన్సేషనల్ క్రైమ్.. సీఎం మెడకు స్మగ్లింగ్ వ్యవహారం.. టాప్ ఐఏఎస్ ఔట్.. పెనుదుమారం
దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో శివసేన అధికారిక పత్రిక సామ్నా వేదికగా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ సూపర్ పవర్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఇలా జరగడం దురదృష్టకరమని, ప్రతి 24 గంటలకు 25వేల పైచిలుకు కొత్త కేసులు వస్తుండటం బాధాకరమని, 2021లోపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదుకాబట్టి అప్పటిదాకా వైరస్ తో సహజీవనం తప్పేలా లేదని పేర్కొంది.
మహారాష్ట్రంకు సంబంధించి వైరస్ వ్యాప్తి నివారణకు, కొవిడ్-19 రోగుల చికిత్సకు తమ ప్రభుత్వం శక్తికి మించి పనిచేస్తున్నదని, రాష్ట్రంలో కోవిడ్ రోగులు కోలుకుంటున్నారని, అయితే థానే లాంటి ప్రాంతంలో మాత్రం పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని శివసేన పార్టీ సామ్నా పత్రికతో చెప్పుకుంది. దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్ గా ఉన్న మహారాష్ట్రలో మంగళవారం నాటికి 2.12లక్షల కేసులు నమోదుకాగా, అందులో 9026మంది ప్రాణాలు కోల్పోగా, 1.15లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 87వేలుగా ఉంది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన గడిచిన 24 గంటల్లో దేశ్యాప్తంగా 22,771 కొత్త కేసులు, 467 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.2లక్షలకు, మరణాల సంఖ్య 20,198కి పెరిగింది. దేశంలో రికవరీ రేటు గణీయంగా ఉండటంతో ఇప్పటికే 4.41లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 2.61లక్షల యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. కేసుల సంఖ్యలో ఈ మధ్యే రష్యాను దాటేసిన భారత్ ప్రపంచ టాప్ 3 స్థానానికి ఎగబాకింది. 30లక్షల కేసులతో అమెరికా మొదటి స్థానంలో, 16 లక్షల కేసుసలతో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. కరోనా విలయం వేళ కలిసికట్టుగా పనిచేయాల్సిందిపోయి, అధికార పార్టీలు పొలిటికల్ విమర్శలకు దిగుతుండటం చర్చనీయాంశమైంది.