సిగ్గుమాలిన పని, నకిలీ దేశభక్తి: మాజీ క్రికెటర్ సిద్ధు, బీజేపీపై శివసేన తీవ్ర విమర్శలు
ముంబై: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరై ఆ దేశ ఆర్మీ చీఫ్ను పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆలింగనం చేసుకోవడంపై శివసేన మండిపడింది. అది సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. నోట్ల రద్దును విమర్శించిన వారిని దేశద్రోహులుగా అభివర్ణించినవారు.. సిద్ధూపై అలాంటి ముద్రవేయకపోవడమేంటని బీజేపీపైనా మండిపడింది.
ఈ మేరకు తన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. 'మోడీని, పెద్దనోట్ల రద్దును విమర్శించిన వారిని దేశ వ్యతిరేకులుగా అప్పట్లో ముద్ర వేశారు. అలాంటిది పాకిస్థాన్ వెళ్లి అక్కడి ఆర్మీ చీఫ్ను హత్తుకున్న సిద్ధూపై అలాంటి ముద్ర వేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను మోడీ ఆలింగనం చేసుకుంటే గొప్ప చర్యగా అభివర్ణించినప్పుడు సిద్ధూను మాత్రమే ఎందుకు బాధ్యులను చేయాలి' అంటూ మోడీపైనా విమర్శలు గుప్పించింది.
సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్కు కూడా ఆహ్వానం అందినా వారు హాజరు కాలేదన్న విషయాన్ని శివసేన గుర్తుచేసింది. సిద్ధూ మాత్రమే వెళ్లి తన నకిలీ దేశభక్తిని నిరూపించుకున్నారని ఎద్దేవాచేసింది. భారత్పై అక్కసు వెళ్లగక్కే వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ అని, ఆయన వల్ల దేశానికి మరిన్ని తలనొప్పులు తప్పవని శివసేన హెచ్చరించింది.
ఒకవేళ పాక్పై అంత ప్రేమే ఉంటే అక్కడికే వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయాలని సిద్ధూకు సలహా ఇచ్చింది శివసేన. సిద్ధూపై రాహుల్ గాంధీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్యానించింది. అంతేగాక, సిద్ధు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని, అతని సొంత పార్టీ బీజేపీనే కదా.. ఆ పార్టీ ఏం సంస్కారం నేర్పిందంటూ బీజేపీపై మండిపడింది.