బీజేపీకి షాక్: అరవింద్ కేజ్రీవాల్కు మద్దతు తెలిపిన శివసేన, అమిత్ షా కలిసినా..
న్యూఢిల్లీ/ముంబై: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరసనకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే నీతి అయోగ్ భేటీ సందర్భంగా ఆదివారం ఢిల్లీకి వెళ్లిన ఏపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, పినరాయి విజయన్, మమతా బెనర్జీ, కుమారస్వామిలు మద్దతు పలికారు. ఇప్పుడు శివసేన కూడా అండగా నిలిచింది.
ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఆందోళన చేస్తున్నారని, వారిని విరమింప చేసేలా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ చొరవ తీసుకోవాలని, అలాగే పలు సమస్యలను పరిష్కరించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో చేస్తోన్న ఈ నిరసన ధర్నా సోమవారం కూడా కొనసాగుతోంది.
దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడారు. ఢిల్లీ కోసం పనిచేసే హక్కు ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఉందన్నారు. ఎందుకంటే ఏఏపీ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అన్నారు. తమ పార్టీ చీఫ్ ఉద్దవ్ థాకరే కూడా కేజ్రీవాల్కు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారన్నారు. కేజ్రీవాల్ చేపట్టిన ధర్నా వినూత్నమైందని, ఏఏపీ సర్కార్ ఎదుర్కొంటున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచివి కావని ఉద్దవ్ థాకరే చెప్పారని సంజయ్ రౌత్ తెలిపారు. కాగా, ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శివసేన అధినేతను కలిశారు. కానీ శివసేన మాత్రం బీజేపీకి వ్యతిరేకంగానే ఉంది.
ఆందోళనలు చేయటం లేదు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలపై ఐఏఎస్ల సమాఖ్య ఆదివారమే ఖండించింది. వారు మీడియా ముందుకు వచ్చారు. కేజ్రీవాల్ తమపై చేస్తున్న ఆరోపణలు అసత్యమన్నారు. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఎవరూ సమ్మే చేయడం లేదన్నారు. అవసరాన్ని బట్టి చివరకు సెలవు రోజుల్లో కూడా పని చేస్తున్నామన్నారు.