సేనకు గుణపాఠం చెప్పిన బీజేపీ..కేంద్రంలో ఎన్సీపీకి రెండు పదవులు: అథవాలే
ముంబై: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను దేశం యావత్తు ఎంతో ఆసక్తితోను నిశితంగా పరిశీలిస్తోంది. ఒక్కరాత్రిలోనే అక్కడి రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడంతో మళ్లీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. శివసేన కాంగ్రెస్ ఎన్సీపీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది ఎంతో కాలం నిలవదని శుక్రవారం వ్యాఖ్యలు చేసిన రాందాస్ అథవాలే...శనివారం మరో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ నుంచి రాజ్భవన్ దాకా: మహారాష్ట్రలో ఏమి జరిగింది..మినిట్ టూ మినిట్ అపడేట్స్
శివసేనకు బీజేపీ గుణపాఠం
మహారాష్ట్రలో శివసేన పార్టీకి బీజేపీ గట్టి గుణపాఠం చెప్పిందని అన్నారు కేంద్రమంత్రి రాందాస్ అథవాలే. అర్థరాత్రి చోటుచేసుకున్న నాటకీయపరిణామాల అనంతరం రాందాస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్లు ప్రమాణస్వీకారం చేశాక అథవాలే ఈ కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వం బీజేపీనే ఏర్పాటు చేస్తుందని ఎలాంటి కంగారు అక్కర్లేదని కొద్దిరోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన మాటలను అథవాలే ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కేంద్రంలో ఎన్సీపీకి రెండు మంత్రి పదవులు
అమిత్ షా ఎప్పుడైతే ఆ మాటలు చెప్పారో అప్పుడే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే నమ్మకం విశ్వాసం తమకు కలిగిందని చెప్పారు అథవాలే. తాను చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం చేస్తే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమం అవుతుందని తాను ఆనాడు అమిత్ షాకు చెప్పినట్లు అథవాలే చెప్పారు. అయితే అంతా సర్దుకుంటుందని , మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అమిత్ షా చెప్పినట్లు అథవాలే వెల్లడించారు.అనుకున్నట్లుగానే బీజేపీ శివసేన మద్దతు తీసుకోకుండా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఇక కేంద్రంలో ఎన్సీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు ఇస్తామని ఆయన వెల్లడించారు.
ఆ రెండు మంత్రి పదవులు ఎవరికి..?
ఇక ఎన్సీపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. అయితే ఆ పార్టీ నుంచి ఇద్దరికి కేంద్రకేబినెట్లో చోటు కల్పిస్తామని అథవాలే చెప్పారు. అయితే ఆ ఇద్దరు ఎవరా అనేది ప్రస్తుతం ఎన్సీపీలో చర్చ జరుగుతోంది. వారిద్దరికీ ఇప్పటికే బీజేపీ ఎరవేసిందా అనేదానిపై కూడా చర్చ సాగుతోంది. శరద్ పవార్ కుమార్తే సుప్రియా సూలే ఈ రేసు నుంచి దాదాపుగా లేనట్టే. ఇక మిగిలిన ముగ్గురు అయిన సతారా ఎంపీ ఉదయన్ రాజే భోస్లే, రాయిగడ్ ఎంపీ సునీల్ తత్కారే, శిరూర్ ఎంపీ అమోల్ కోల్హేలు శరద్ పవార్ను కాదని మంత్రి పదవులకు ఓకే చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్సీపీ ఎంపీల మధ్య కూడా చీలికను తీసుకువచ్చే స్కెచ్ బీజేపీ గీసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.