సీఎం పదవి పై తేల్చేవరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాదు: శివసేన
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు విడుదలై రెండురోజులు మాత్రమే అయ్యింది. ఇక బీజేపీ శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సంపాదించింది. ఇక ప్రభుత్వం ఏర్పాటే తరువాయి అనుకుంటున్న సమయంలో శివసేన పార్టీ మరో బాంబు పేల్చింది. ఇప్పటికే మంత్రి పదవులతో సహా మిగతా పదవులు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పంథాలో పోతున్న శివసేన తాజాగా ఆ పార్టీ అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
శివసేన తీరుతో ఇరకాటంలో బీజేపీ
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని తపిస్తోంది మహారాష్ట్రలోని శివసేన పార్టీ. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఏ ఒక్క పార్టీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. అయితే కూటమిగా పోటీ చేసిన బీజేపీ -శివసేనలు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ టచ్ చేశారు. ఇక తక్కువ సీట్లు గెల్చుకున్న బీజేపీకి శివసేన పక్కలో బళ్లెంలా తయారైంది. శివసేన వ్యవహరిస్తున్న తీరుతో ముందు నుయ్యి వెనకగొయ్యి అన్నట్లుగా బీజేపీ పరిస్థితి తయారైంది. ఇప్పటికే 50:50 ఫార్ములాకు డిమాండ్ చేస్తున్న శివసేన... మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పై డిసైడ్ చేసేవరకు ఎలాంటి ప్రభుత్వం ఇక్కడ ఉండదని ఆ పార్టీనేత ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం పదవి సీఎం పదవి కూడా 50:50 అంటున్న శివసేన
ముఖ్యమంత్రి పదవి రెండు పార్టీలు రెండున్నరేళ్ల పాటు పంచుకోవాలనే డిమాండ్ శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బీజేపీ ముందుంచారు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే దీనికి బీజేపీ ఒప్పుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. అది కూడా బీజేపీ జాతీయాధ్యక్షుడిగా అమిత్ షా లిఖితపూర్వకంగా ఇవ్వాలని థాక్రే డిమాండ్ చేశారు. అప్పుడైతేనే ప్రభుత్వం మహారాష్ట్రలో ఏర్పాటు అవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని శివసేన ఎమ్మెల్యేల భేటీలో నిర్ణయించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయిక్ చెప్పారు. ఎన్నికల ముందు చెరోసగం సీట్లలో పోటీచేస్తామన్న దానికి బీజేపీ కట్టుబడలేదని అయినప్పటికీ తామే దిగొచ్చామని సర్నాయిక్ చెప్పారు. ఒకవేళ బీజేపీ ఒప్పుకుంటే శివసేన పార్టీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరుంటారా అనేదానిపై ఇంకా నిర్ణయం జరగలేదని వెల్లడించారు.
బీజేపీ ప్రదర్శనను అడ్వాంటేజ్గా తీసుకున్న శివసేన
ఇదిలా ఉంటే థాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలిచిన యువనాయకుడు ఆదిత్య థాక్రేనే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని చాలా మంది శివసేన ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 2014 కంటే 2019లో 17 సీట్లు కోల్పోయి 122 స్థానాలు మాత్రమే గెలిచింది. ఇదే శివసేనకు అడ్వాంటేజ్ అయిందని ఈ ఫలితాలు చూసుకునే శివసేన బీజేపీని ఓ ఆటఆడుకుంటోందని అనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు శివసేనకు 2014లో 63 సీట్లు ఉండగా.. ఈ సారి ఏడు సీట్లు తగ్గి 56 సీట్లకే పరిమితమైంది. ఒకవేళ బీజేపీ తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ఇతర ద్వారాలు తెరిచేఉన్నాయని శివసేన చెబుతోంది.