మరో పాతికేళ్లు పాతకుపోతాం..ఇక బీజేపీ తరం కాదు: అధికారాన్ని మర్చిపోండి
ముంబై: మహారాష్ట్రలో శివసేన సారథ్యంలో కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ మూడు పార్టీల మధ్య 40 పాయింట్లతో కూడిన కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్)కు ఏకాభిప్రాయానికి వచ్చారు. కనీస ఉమ్మడి ప్రణాళికను అమలు చేయడానికి శివసేన సై అనడంతో ఇక ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్-ఎన్సీపీల కూటమి ముందుకొచ్చింది. శివసేన నాయకుడు ముఖ్యమంత్రిగా రేపో, మాపో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
మీరు రాకపోతే అదే పదివేలు: రక్షణ కల్పించడం మా వల్ల కాదు: శబరిమలపై కేరళ మంత్రి సంచలనం..!
పక్కా వ్యూహాత్మకంగా..
ఈ పరిస్థితుల మధ్య శివసేన అధికార ప్రతినిధి, పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యానాలు చేశారు. ఒక్కసారి ప్రమాణ స్వీకారం చేయడమంటూ జరిగితే.. మరో పాతికేళ్లు తామే అధికారంలో ఉంటామని తేల్చి చెప్పారు. దీనికి అనుగుణంగా తాము పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించుకుంటామని చెప్పారు. ప్రతి పౌరుడికీ సంక్షేమ పథకాల లబ్ది అందేలా ప్రణాళికలను రూపొందించుకుంటామని, దీనికి అనుగుణంగా పాలన సాగిస్తామని అన్నారు. మరో పాతికేళ్ల పాటు తాము మహారాష్ట్ర అధికారంలో పాతుకుని పోతామని, బీజేపీ ఏమీ చేయలేదని చెప్పారు. ఆ పార్టీ నాయకులు ఇక అధికారాన్ని మర్చిపోవాల్సిందేనని సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు.
రాజకీయ దురంధరులతో కలిసి..
కాంగ్రెస్, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీల్లో రాజకీయ దురంధరులు ఉన్నారని, వారి అనుభవాలను పరిపాలనలో వినియోగించుకుంటామని అన్నారు. అటు కాంగ్రెస్ లో, ఇటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకులు ఉన్నారని చెప్పారు. వారి సలహాలు, సూచలనతో పాటు సొంత నిర్ణయాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తామని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో శివసేన నాయకుడే ముఖ్యమంత్రి కావాలని కోట్లాదిమంది మరాఠీయులు కోరుకున్నారని, ప్రత్యేక ప్రార్థనలు చేశారని అవి ఫలించడం వల్లే తమకు ముఖ్యమంత్రి పదవి దక్కిందని చెప్పారు.
మౌలిక సదుపాయాల కల్పన.. రైతు సంక్షేమమే
ముంబై మహా నగరానికి దేశ రెండో ఆర్థిక రాజధానిగా పేరుందని, అలాంటి నగరంలో మౌలిక సదుపాయాల కల్పనారంగంలో కొరతలు ఉన్నాయని చెప్పారు. వాటిని భర్తీ చేస్తామని చెప్పారు. పేరుకు అనుగుణంగా మహారాష్ట్రలో దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలబెడతామని అన్నారు, రైతుల సంక్షేమం కోసం వినూత్న చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తరచూ కరవు బారిన పడే విదర్భ ప్రాంతంలో నీటి ఎద్దడిని నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడతామని, తాజాగా వరదల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంపై దృష్టి పెడతామని సంజయ్ రౌత్ చెప్పారు.