దారి తప్పిన ఫ్యాకల్టీ.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా: శివసేన ఈడ్చి కొట్టింది..
ఇనిస్టిట్యూట్ మేనేజర్ కూడా అతనికే వంతపాడటంతో.. శివసేన కార్యకర్తలు ఆయనపై కూడా చేయి చేసుకున్నారు.
ఔరంగాబాద్: విద్యార్థులను సరైన మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పారు. పాఠాలు బోధించాల్సింది పోయి.. లైంగిక పాఠాలకు బలవంతం చేశారు. విషయం ఆ నోటా.. ఈ నోటా.. శివసేన చెవిన పడటంతో.. సేన కార్యకర్తలు సదరు ఉపాధ్యాయులను చితక్కొట్టారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్న స్థానిక ఆకాష్ ఇనిస్టిట్యూట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇనిస్టిట్యూట్ విద్యార్థినుల పట్ల ఫ్యాకల్టీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలే ఈ దాడికి దారి తీశాయి. దీనిపై శివసేనకు ఫిర్యాదు అందడంతో.. రంగంలోకి దిగిన సేన కార్యకర్తలు.. సదరు ఫ్యాకల్టీకి దేహశుద్ది చేశారు.
ఇనిస్టిట్యూట్ మేనేజర్ కూడా అతనికే వంతపాడటంతో.. శివసేన కార్యకర్తలు ఆయనపై కూడా చేయి చేసుకున్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. గొడవను సద్దుమణిగించి ఫ్యాకల్టీని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.