రెచ్చిపోయిన శివసేన... బీజేపీ నేతపై నల్ల ఇంకు చల్లి,చీర చుట్టి వీధుల్లో ఊరేగింపు..
మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేని విమర్శించినందుకు ఓ వ్యక్తిపై నల్ల ఇంకు చల్లారు. అంతేకాదు,అతనికి చీర చుట్టి వీధుల్లో ఊరేగిస్తూ పిడి గుద్దులు కురిపించారు. మధ్యలో ఓ పోలీస్ వారిని నిలువరించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈ ఘటన సోలాపూర్ జిల్లాలోని పందర్పూర్లో చోటు చేసుకుంది.
Recommended Video
'బీజేపీకి చెందిన శిరీష్ కంటేకర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ గౌరవనీయ వ్యక్తిని,రాష్ట్రానికి ముఖ్యమంత్రిని పట్టుకుని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఈ దాడికి మేమే బాధ్యత వహిస్తాం... జైలుకు వెళ్లేందుకైనా మేము సిద్దమే...' అని దాడి అనంతరం ఓ శివసేన కార్యకర్త మీడియాతో మాట్లాడారు.
మరోవైపు రాష్ట్ర బీజేపీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. శివసేన గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగిందని... శివసేన పాలనలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆరోపించింది.
కాగా,ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే పనికి రారని శిరీష్ కంటేకర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఒక సాధారణ శివసేన కార్యకర్తను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన థాక్రే... ఆ మాటను పక్కనపెట్టి తానే ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించినట్లు చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన శివసేన నేతలు శిరీష్ కంటేకర్పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించి 17 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#WATCH I Maharashtra: Shiv Sena workers allegedly pour black ink on a BJP leader and forced him to wear a saree after the latter criticised Chief Minister Uddhav Thackeray, in Solapur pic.twitter.com/gdtL9gChT1
— ANI (@ANI) February 7, 2021
కాగా,మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మిత్రపక్షం శివసేన ఆ పార్టీకి ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివసేనకు సీఎం సీటు ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో ఆ పార్టీ ఎన్డీయే నుంచి బయటకొచ్చింది.ఆపై నేషనల్ కాంగ్రెస్,కాంగ్రెస్ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకుముందు ఎన్సీపీకి చెందిన కీలక నేత అజిత్ పవార్ను తమవైపుకు తిప్పుకోవడం ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ... ఆయన తిరిగి సొంతగూటికి చేరడంతో బీజేపీ ప్రభుత్వానిది మూడు రోజుల ముచ్చటే అయింది.