శివసేన నాయకుడిపై హత్యాయత్నం (వీడియో)
లూథియానా: పంజాబ్ శివసేన యూత్ విభాగం అధ్యక్షుడి మీద హత్యాయత్నం జరిగింది. దుండగులు ఆయన మీద తుపాకితో కాల్పులు జరిపి హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. బుధవారం రాత్రి పొద్దు పోయిన తరువాత అమిత్ అరోరా మీద హత్యాయత్నం జరిగింది.
అమిత్ అరోరా మెడలో బుల్లెట్ లు దూసుకు వెళ్లాయని, ఆయన సీఎంసీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని బాధితుడి సోదరుడు అరోరా చెప్పారు. కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి పరారైనారు.
లూథియానా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యాయత్నం జరిగిన పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల పుటేజీలు పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. దుండగులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు అంటున్నారు.
అయితే శివసేన యూత్ విభాగం అధ్యక్షుడు అమిత్ అరోరా మీద జరిగిన హత్యాయత్నాన్ని పలువురు శివసేన నాయకులు ఖండించారు. పంజాబ్ శివసేన చీఫ్ రాజీవ్ టండాన్ మాట్లాడుతూ దుండగులను త్వరలో అరెస్టు చెయ్యాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.