నేడు జల్లికట్టు, రేపు ఎండ్లబండ్లు, బుల్ బుల్ పిట్ట పోటీలు, శివసేన
ముంబై/చెన్నై: జల్లికట్టుకు అనుమతించాలంటూ తమిళలు సాగిస్తున్న ఆందోళన ఇంకా చల్లారకముందే తాము ఎండ్లబండ్ల పోటీలు నిర్వహించడానికి ఆందోళన చేస్తామని శివసేన తాజాగా కేంద్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా హెచ్చరించింది.
2014లో సుప్రీం కోర్టు నిషేధించిన ఎండ్లబండ్ల పోటీల కోసం తాము ఆందోళన చేస్తామని శివసేన, సుప్రీం కోర్టు తీర్పు వల్ల అసోంలో నిలిచిపోయిన బుల్ బుల్ పిట్ట పోటీలకు అనుమతి ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళన చేస్తామని శనివారం ప్రకటించారు.
వినాయక చవితి వేడుకల్లో భాగంగా పూణె ఫెస్టివల్ లో ఎండ్లబండ్ల పోటీలను దాదాపు 30 ఏళ్లు నిర్వహించారు. అయితే జల్లికట్టుతో పాటు ఎండ్లబండ్ల పోటీలను సుప్రీం కోర్టు నిషేధించింది. అప్పటి నుంచి పూణెలో ఎండ్లబండ్ల పోటీలు నిర్వహించడం లేదు.
ఇప్పుడు సాంప్రదాయ జల్లికట్టు క్రీడను రక్షించుకోవడానికి తమిళ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాము సాంప్రదాయ ఎండ్లబండ్ల పోటీలను రక్షించుకోవడానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ఆందోళన చేస్తామని శివసేన పార్టీ ప్రకటించింది.
శివసేన ఈ విషయం ప్రకటించిన వెంటనే అసోం ప్రజలు తాము బుల్ బుల్ పిట్ట పోటీల కోసం ఆందోళన చేస్తామని ప్రకటించారు. మకర సంక్రాంతి సమయంలో అసోంలో భోగాలి బిహు పేరిట పంటల పండగలు జరుపుకుంటారు.
ఆ సమయంలో రెండు పిట్టల కాళ్లకు తాళ్లు కట్టి వాటిని ఓ టేబుల్ మీద పెట్టి వాటికి ఇష్టం అయిన ఆహారం ఆశ చూపి కోడిపందేల మాదిరి కొట్టుకు చచ్చేట్లు పోటీలు నిర్వహిస్తారు. ఆ సమయంలో రెండు పిట్టల గెలుపోటముల మీద ప్రజలు పందెం కాస్తారు.
సుప్రీం కోర్టు తీర్పు కారణంగా బుల్ బుల్ పిట్ట పోటీలు నిలిచిపోయాయి. ఇప్పుడు జల్లికట్టు క్రీడ కోసం పెద్ద ఎత్తున పోరాటం జరగడంతో శివసేన, అసోం ప్రజలు తాము సాంప్రదాయ క్రీడల కోసం పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.