మహారాష్ట్ర ఎన్నికలు: బీజేపీ-శివసేన పొత్తులపై క్లారిటీ
మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల గంట మోగిన రాజకీయ పార్టీల మధ్య పొత్తులు మాత్రం తేలడం లేదు. అధికార బీజేపీ-శివసేన సీట్ల కేటాయింపై క్లారిటీ లేదు. ఇటీవల శివసేన, బీజేపీ ఆయా చోట్ల పోటీ చేస్తామని వివరించాయి. కానీ ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించకపోవడంతో పొత్తు పొడిచేనా అనే అనుమానం తలెత్తుతుంది. ఈ క్రమంలో ఇవాళ సీట్ల కేటాయింపుపై క్లారిటీ ఇస్తామని ఇరుపార్టీలు మీడియాకు సమాచారం అందజేశాయి.
శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే- మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి సంయుక్తంగా సీట్ల కేటాయింపుపై మీడియాకు తెలియజేస్తారని పేర్కొన్నారు. ఆదివారం రోజున నవరాత్రి కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పొత్తులు ప్రకటించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అమ్మవారి దయతో సీట్ల కేటాయింపు ప్రకటించి, ప్రజల్లోకి ముందుకెళ్తే మంచి జరుగుతుందని వారు భావిస్తున్నారు.
వాస్తవానికి సీట్ల కేటాయింపు ఇదివరకే చేపట్టాల్సి ఉంది. కానీ బీజేపీ-శివసేన పోటీ చేసే స్థానాలపై క్లారిటీ రాకపోవడంతో ఇన్నాళ్లు ఆగిపోయారు. కానీ బీజేపీ 144, శివసేన 126 పోటీ చేస్తారని విశ్వసీనయంగా తెలిసింది. మిగిలిన 18 స్థానాలకు తమ భాగస్వామ్యపక్షాలకు కేటాయిస్తారు. బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రస్తుత సీఎం ఫడ్నవీస్ తిరిగి పగ్గాలు చేపడుతారు. డిప్యూటీ సీఎం పదవీ మాత్రం శివసేనకు అప్పగిస్తామని వీరి మధ్య ఒప్పందం జరిగింది. కానీ ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే కూడా సీఎం రేసులో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై శివసేన పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. కానీ బీజేపీతో ఉద్దవ్ థాకరే ఏం చెప్పారనే అంశంపై క్లారిటీ లేదు