ఇది అన్యాయం..అజిత్ పవార్పై కేసులు ఎలా మూసివేస్తారు: సుప్రీం కోర్టులో శివసేన పిటిషన్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు మీద మలుపులు చోటుచేసుకుంటున్నాయి. అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన 48 గంటల్లోనే ఆయనపై ఉన్న ఇరిగేషన్ స్కామ్ కేసులో ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చజరిగింది.
అయితే ఉన్న 20 కేసుల్లో 9 కేసులకు మాత్రమే క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆ తర్వాత ఏసీబీ వివరణ ఇచ్చింది. అయితే అజిత్ పవార్ మద్దతు ఇవ్వడం వల్లే క్విడ్ ప్రోకో కింద అతనికి కేసుల నుంచి ఊరట ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ధ్వజమెత్తాయి కాంగ్రెస్ శివసేన ఎన్సీపీ పార్టీలు. అజిత్ పవార్ పై కేసులు మూసివేయడం అనేది అక్రమం అని ఆ పార్టీలు విమర్శించాయి.
అజిత్ పవార్కు ఇరిగేషన్ స్కామ్లో ఊరటనిస్తూ ఏసీబీ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ శివసేన పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు బలనిరూపణ కాకుండానే ఇలాంటి నిర్ణయాలు ఫడ్నవీస్ తీసుకోరాదని పిటిషన్లో పేర్కొంది.
ఇక ఫడ్నవీస్ - అజిత్ పవార్లు ప్రమాణస్వీకారం చేయడం అన్యాయమని పేర్కొంటూ శివసేన ఎన్సీపీ కాంగ్రెస్లు దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారానికి తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఆ తీర్పు తర్వాత తాజా పిటిషన్ అంటే ఏసీబీ నిర్ణయంపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు వస్తుంది.
అంతకుముందు అజిత్ పవార్ ,షరద్ పవార్కు మహావికాస్ అగాఢీకి షాక్ ఇస్తూ బీజేపీతో చేతులు కలపడంపై మండిపడింది శివసేన. శరద్ పవార్ కష్టంతో ఎన్సీపీ ఆవిర్భవించిందని , నిజంగానే దమ్ము ఉంటే అజిత్ పవార్ సొంత పార్టీని స్థాపించాల్సి ఉండేదని సవాల్ విసిరింది. ఇక చీఫ్ విప్, లెజిస్లేచర్ పార్టీ లీడర్ అనేది రెండు వేర్వేరు పోస్టులని ఎన్సీపీ సీనియర్ నేత ఒకరు శివసేన మాతృపత్రిక సామ్నాతో చెప్పారు.అయితే రెండు రోజుల క్రితం వరకు ఎన్సీపీ పార్టీ ఎవరిని చీఫ్ విప్గా నియమించలేదని సామ్నా కథనం ప్రచురించింది.