హిందూత్వంను దేశంలో తొలుత టచ్ చేసిందే మేము: బీజేపీపై శివసేన ఫైర్
ముంబై: ఎన్డీయేకు శివసేన కటీఫ్ చెప్పిన తర్వాత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా శివసేన మాతృపత్రిక సామ్నాలో ఆ పార్టీ బీజేపీని దుమ్మెత్తి పోసింది. ఈ రోజు బీజేపీ మాట్లాడుతున్న హిందూత్వం దేశభక్తి అనే పదాలు ఎలా వచ్చాయో శివసేన పార్టీ సామ్నా పత్రిక ద్వారా తెలియచెప్పే ప్రయత్నం చేసింది.
హిందూత్వంను మొదట శివసేన టచ్ చేసింది
ఎలాంటి చర్చలు లేకుండానే ఎన్డీయే నుంచి శివసేన బయటకు వెళ్లిపోయిందంటూ బీజేపీ చేసిన ప్రకటనపై శివసేన మండిపడింది. హిందూత్వం అనే పదాన్ని ఇంకా ఎవరూ ముట్టుకోనప్పుడే శివసేన పార్టీ హిందూత్వ అజెండాను మోసిందని గుర్తుచేసింది. ఈ రోజు మాట్లాడుతున్న నాయకులంతా ఇంకా అప్పటికి పుట్టలేదని చురకలంటించింది.
సంఘ్ బలోపేతంలో శివసేనదే కీలక పాత్ర
ఎన్డీయే నుంచి శివసేనను బహిష్కరించేందుకు బీజేపీ ఎవరని శివసేన పార్టీ సూటిగా ప్రశ్నించింది. తమను బహిష్కరించామని చెబుతున్న వారు చరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకోవాలని శివసేన పార్టీ సామ్నాలో రాసుకొచ్చింది. సంఘ్ బలోపేతానికి కృషిచేసింది శివసేన పార్టీ అని గుర్తుచేసింది. బాల్ థాక్రే, వాజ్పేయి, అద్వానీ, ప్రకాష్ సింగ్ బాదల్, జార్జ్ ఫెర్నాండెజ్లు ఎన్డీయే వ్యవస్థాపకులని గుర్తుచేసింది. ఆ సమయంలో ప్రస్తుతం ఉన్న చాలామంది నాయకులు లేరు అని వెల్లడించింది.
ఒకానొక సమయంలో బీజేపీ వైపు ఎవరూ నిలబడలేదు
ఎన్డీయే నుంచి వైదొలిగినందున పార్లమెంటులో విపక్షాల వైపున శివసేన ఎంపీలకు సీట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన ప్రహ్లాద్ జోషిపై శివసేన మండిపడింది. శివసేన అజెండా, ఎన్డీయే కార్యాచరణ గురించి ప్రహ్లాద్ జోషికి పూర్తిగా తెలియదని మండిపడింది. ఒకానొక సమయంలో బీజేపీ వైపు ఎవరూ నిలబడలేదని గుర్తు చేసిన శివసేన దేశంలో తొలిసారిగా హిందూత్వం, జాతీయతను చాటింది శివసేన పార్టీ అని గుర్తుచేసింది.
Recommended Video
ఎన్డీయేను సంప్రదించకుండానే ముఫ్తీ, నితీష్లతో జట్టు
జమ్ముకశ్మీర్లో బీజేపీ-పీడీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఎన్డీయేని సంప్రదించి చేశారా అని ప్రశ్నించిన శివసేన... బీహార్లో జేడీయూతో కలిసినప్పుడు అదే ఎన్డీయే అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. ఎన్డీయేకు వ్యతిరేకంగా శివసేన వ్యవహరించిందని బీజేపీ భావించినట్లయితే ఎన్డీయే సమావేశంలో చర్చించేందుకు శివసేనను ఎందుకు ఆహ్వానించలేదని మండిపడింది. అంతేకాదు బీజేపీని మొఘల్ చక్రవర్తి మొహ్మద్ ఘోరీతో పోల్చింది శివసేన పార్టీ. నమ్మకద్రోహం చేసిన వారికి మహారాష్ట్ర ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని వెల్లడించింది. బీజేపీపై యుద్ధం ఆరంభంలోనే ఉందని ఇంకా ముగియలేదని శివసేన పార్టీ సామ్నా ద్వారా వెల్లడించింది.