మహారాష్ట్ర రాజకీయాలు: గవర్నర్ తీరుపై సుప్రీంకు శివసేన..వాదించేదెవరో తెలుసా..?
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో శివసేన విఫలమవడంతో గడువు కావాలని గవర్నర్ను విజ్ఞప్తి చేసినప్పటికీ గవర్నర్ తిరస్కరించడంపై ఆగ్రహంతో ఊగిపోతోంది శివసేన పార్టీ. ఈ క్రమంలోనే న్యాయనిపుణుల సలహా తీసుకుంది. గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు తయారైంది శివసేన పార్టీ.
సమయం ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టుకు శివసేన
సోమవారం ఉదయం మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని గవర్నర్కు తెలపడంతో శివసేనను గవర్నర్ భగత్ సింగ్ కోష్యార్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ 24 గంటల సమయం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు శివసేన ప్రకటించి కేంద్ర కేబినెట్లో ఉన్న తమ పార్టీ అభ్యర్థి అరవింద్ సావంత్తో మంత్రిపదవికి రాజీనామా చేయించింది. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని భావించిన శివసేన.. మరో 24 గంటలు సమయం ఇవ్వాలంటూ గవర్నర్ను కోరింది.అయితే తమ విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించారు.
బీజేపీకి సమయం ఇచ్చారు..మాకెందుకు ఇవ్వలేదు
ఇక గవర్నర్ తీరు బాగలేదని శివసేన విమర్శించింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మూడురోజుల సమయం ఇచ్చిన గవర్నర్... తమకు మాత్రం ఎందుకు అదనంగా ఒక్కరోజు ఇవ్వరని మండిపడింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని శివసేన భావించింది. ఇందుకోసం శివసేన తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదించనున్నట్లు సమాచారం. తమకు మద్దతు తెలపడంపై ఎన్సీపీ కాంగ్రెస్లు ఆలోచిస్తున్నందున మరింత సమయం కావాలని గవర్నర్ను ఆదిత్య థాక్రే కోరగా ఇందుకు తిరస్కరించారు.
కాంగ్రెస్ జాప్యంతో ముగిసిన గడువు
ఇదిలా ఉంటే శివసేనకు మద్దతు విషయమై నోటిమాటతో సోనియా ఓకే చెప్పినప్పటికీ.. ఆ తర్వాత పరిణామాలతో కాంగ్రెస్ కాస్త వెనక్కు తగ్గింది. వాస్తవాలు గ్రౌండ్ రియాల్టీలు తెలుసుకోకుండా శివసేనతో ఎన్సీపీ, కాంగ్రెస్లు కలవడంపై సమాలోచనలు చేసింది. ఈ క్రమంలోనే అనుకున్న సమయానికి మద్దతు లేఖ విడుదల చేయలేకపోయింది. అయితే ఏ అంశాలపై క్లారిటీ కోరుతున్నారనేదానిపై మాత్రం కాంగ్రెస్ స్పష్టత ఇవ్వలేదు.