మోడీ! మీకు మిత్రపక్షాలు వద్దు, డబ్బు పంచి గెలిచారు: బీజేపీపై ఉద్ధవ్ థాకరే సంచలనం, యోగి ఆదిత్యనాథ్ పై
ముంబై: బీజేపీపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మిత్రపక్షాలు అవసరం లేదన్నారు. అన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పని చేసేందుకు ముందుకు రావాలన్నారు. పాల్ఘర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని తాము స్వీకరించడానికి తాము సిద్ధంగా లేమని చెప్పారు. బీజేపీ ఏజెంట్లతో ఎన్నికల కమిషన్ నిండిపోయిందన్నారు.
బీజేపీకి కాంగ్రెస్ దెబ్బకు దెబ్బ: ఉపఎన్నిక గెలుపుతో సీన్ రివర్స్, మేఘాలయలో కర్ణాటక రిపీట్?
ఉప ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నట్లు ఆధారాలు తాము చూపించిన ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదన్నారు. డబ్బులు పంచినవాళ్లు ఇప్పుడు బీజేపీతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్లోను అవినీతిని చూస్తున్నామని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ను అపాయింట్ చేయవద్దని, ఎన్నుకోవాలనే డిమాండును తీసుకు వచ్చారు.
ఎన్నికల ఫలితం వెల్లడిస్తే కోర్టుకు వెళ్తాం
ఓట్ల లెక్కింపులో ఏదో తేడా ఉందని ఉద్ధవ్ థాకరే అన్నారు. లెక్కింపులో వ్యత్యాసాలను సరిదిద్దే వరకు ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించవద్దని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తే అవసరమైతే తాము కోర్టుకు అయినా వెళ్తామని హెచ్చరించారు. ఇలాంటి ఎన్నికల తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ఉద్ధవ్ వ్యాఖ్యలు చూస్తుంటే పొత్తు త్వరలో తెంచుకునేలా కనిపిస్తున్నారు. అదే జరిగితే మహారాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులే.
యూపీలోనూ బీజేపీని ప్రజలు తిరస్కరించారు
ఉత్తర ప్రదేశ్ ప్రజలు కూడా బీజేపీని తిరస్కరించారని నూర్పూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందన్నారు. పాల్ఘార్ ఉప ఎన్నికల్లో మళ్లీ కౌంటింగ్ జరపాల్సిందే అన్నారు. ఓటర్లకు బీజేపీ డబ్బులు పంచిందన్నారు. పోలింగ్కు ఒక్కరోజు ముందు డబ్బు పంచారన్నారు. లోకసభలో బీజేపీ మెజార్టీ కోల్పోయిందన్నారు. మహారాష్ట్రలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారంతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
యోగి అక్కడ గెలిపించుకోలేకపోయారు కానీ ఇక్కడకొచ్చారు
ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ రెండుచోట్ల మాత్రమే గెలిచిందని ఉద్దవ్ థాకరే అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత రాష్ట్రంలో ఓడిపోయారన్నారు. సొంత రాష్ట్రంలో ఓడిన యోగి మహారాష్ట్రలో ప్రచారానికి వచ్చారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో యోగి ప్రచారం వల్ల బీజేపీకి ఏమీ ఒరగలేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అంతమైందని, ఎన్నికల నిర్వహణపై ఈసీకే నియంత్రణ లేదన్నారు. ఈసీపై అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు.
బీజేపీకి మెజార్టీ తగ్గింది
లోకసభలో బీజేపీకి మెజార్టీ తగ్గిందని ఉద్ధవ్ చెప్పారు. బీజేపీతో పొత్తు తెంచుకుంటే తదుపరి ఎవరితో ముందుకు వెళ్తారని విలేకరులు ప్రశ్నించగా.. ఇక్కడ మేం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఉండే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఉన్నామని, మీ (జర్నలిస్టులు) ఆలోచన నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు లేమన్నారు.
మరోవైపు, పాల్ఘర్లో గెలిచిన బీజేపీ అభ్యర్థికి ఉద్ధవ్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బీజేపీ అభ్యర్థఇ రాజేంద్ర గవిట్కు ఈసీ గెలుపొందినట్లుగా సర్టిఫికేట్ ఇచ్చింది.