మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు..లీకైన ఆడియో టేప్..ఆ మాటలు ఆయనవేనా..?
భోపాల్: మధ్యప్రదేశ్లో లీకైన ఓ ఆడియో టేపు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడినట్లుగా ఉన్న ఆ ఆడియో టేపులో పలు సంచలనాత్మకమైన విషయాలు ఉన్నట్లు బోధపడుతోంది. ఈ ఆడియో ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇంతకీ ఆ ఆడియోలో ఏముంది..? శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడినట్లుగా చెబుతున్నదానిలో సారాంశం ఏంటి..?
మధ్యప్రదేశ్లో వైరల్ అయిన ఆడియో టేపు
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఒక చిన్న ఆడియో టేపు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మధ్యే కాంగ్రెస్ ప్రభుత్వం కూలి బీజేపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. అయితే బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే శివరాజ్ సింగ్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో ఉండటం బీజేపీ అధినాయకత్వానికి ఇష్టం లేదని కమలనాథ్ ప్రభుత్వం కూలదోయాలనే కంకణం కట్టుకుందని తాను చెబుతున్నట్లుగా ఉన్న ఆడియో లీకైంది. మొత్తం 9.8 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియోలో మరో సంచలనమైన మాటలు వెలుగులోకి వచ్చాయి.
జ్యోతిరాదిత్య లేకుండా కూల్చడం కష్టం
కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చడం అంత సులువు కాదని ఇందుకు జ్యోతిరాదిత్య సింధియాతో పాటు అతని అనుచరులు కూడా సహకరిస్తేనే సాధ్యమవుతుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెబుతున్నట్లుగా ఆడియోలో ఉంది. ఇక ఈ ఆడియో వైరల్ కాగానే కాంగ్రెస్ రంగంలోకి దిగింది. దీన్నే ఆయుధంగా మలుచుకుని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందని తాము మొదటి నుంచే చెబుతున్నామని ఇప్పుడు ఈ ఆడియో బయటపడటంతో అది నిజమని తేలిపోయిందని కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఫైర్ అయ్యారు. అయితే బీజేపీ పాల్పడిన ఈ కుట్రరాజకీయంపై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు జితు పట్వార్ చెప్పారు.
తుల్సీ భాయ్ లేకుంటే తాను కొనసాగడం కష్టమే
ఇండోర్లోని సాన్వార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగించారు. ఈ సమయంలోనే ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. జ్యోతిరాదిత్య సింధియా, తుల్సీ భాయ్ల సహకారం లేకుండా కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చగలుగుతామా అని ఆయన ప్రశ్నించారు. తుల్సీ భాయ్ అనే ఈ మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు. ఇప్పుడు రానున్న ఉపఎన్నికల్లో తుల్సీ భాయ్ గెలవకపోతే తాను సీఎం సీటులో ఉండగలనా అంటూ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుందా అంటూ ప్రశ్నించారు. కార్యకర్తలంతా విబేధాలను పక్కనపెట్టి తుల్సీ భాయ్ విజయానికి పనిచేయాలంటూ పిలుపునిచ్చారు.
జరిగింది ఇదీ..
ఇదిలా ఉంటే జ్యోతిరాదిత్యా సింధియాకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తనతో పాటు బీజేపీలో చేరారు. దీంతో మార్చి 20న కమల్నాథ్ ప్రభుత్వం పడిపోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నాల్గవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే కమల్నాథ్ ప్రభుత్వంను కూల్చేందుకు తాము ఎలాంటి కుట్రలు చేయలేదని బీజేపీ వివరణ ఇచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వైరల్ అవుతున్న ఆడియోపై ఇటు బీజేపీ అధినాయకత్వం కానీ అటు సీఎం చౌహాన్ కానీ స్పందించలేదు.