యోగా డే దుమారం.. ఈ ముఖ్యమంత్రిపై ఆ మాజీ సీఎం సెటైర్లు
భోపాల్ : ఇంటర్నేషనల్ యోగా డే.. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్దానికి తెరలేపింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్పై మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఆరోపణాస్త్రాలు గుప్పించారు. ముఖ్యమంత్రి అంటే అధికారం ఒక్కటే కాదని.. రాష్ట్రానికి దిక్సూచిలా ఉండాలని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ కార్యక్రమం జరిగింది. అయితే ముఖ్యమంత్రి హోదాలో కమల్ నాథ్ ఆ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. అనివార్య కారణాలతో ఆయన రాలేకపోయారు. దాంతో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ మాటల యుద్దం ప్రకటించారు.
Recommended Video
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం.. కాళేశ్వరం విశిష్టతలేంటంటే..!
యోగా డే వేడుకలకు కమల్ నాథ్ రాకపోవడాన్ని చౌహన్ తప్పుపట్టారు. ఆయన ఈ కార్యక్రమానికి వస్తే బాగుండేదని.. యోగ ద్వారా కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి అంటే అధికార యంత్రాంగాన్ని నడిపించడం ఒకటే పని కాదని.. రాష్ట్రానికి దిక్సూచిలా వ్యవహరించాల్సిన గురుతర బాధ్యత ఆయనపై ఉందన్నారు.
యోగా డే కు దూరంగా ఉండటాన్ని బట్టి కమల్ నాథ్ తన సంకుచిత స్వభావాన్ని బయటపెట్టుకున్నారని వ్యాఖ్యానించారు చౌహన్. స్థానిక లాల్ పరేడ్ మైదానంలో జరిగిన యోగా డే కార్యక్రమ వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకుండా నిర్వహించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. యోగా డే కు గుర్తింపు వచ్చిందంటే కేవలం మోడీ వల్లే సాధ్యమైందని గుర్తు చేశారు. మోడీ చొరవతోనే ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ యోగా డే ను ప్రకటించిందని తెలిపారు. వేదికపై మోడీ ఫోటో లేకపోవడం కాంగ్రెస్ నేతల అహంకారానికి నిదర్శనమన్నారు. మోడీ దేశ ప్రజలందరికీ ప్రధాని అని.. ఆయన ఏ ఒక్క పార్టీకో చెందిన వ్యక్తి కాదనే విషయం గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు.