సోనియాకు పరువు నష్టం దావా నోటీసులు జారీ
భోపాల్: జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కాంతిలాల్ భూరియాలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అతని భార్య సాధ్నా సింగ్ ఆదివారం రూ. 10 కోట్ల పరువునష్టం దావా వేశారు. చౌహాన్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తూ వార్త పత్రికల్లోనూ, ఇంటర్నెట్లోనూ కాంగ్రెస్ నవంబర్ 13న విడుదల చేసిన ఒక ప్రకటనే ఇందుకు కారణం.
అత్యాశ కలిగిన ఒక కుటుంబం మధ్యప్రదేశ్ను దోచుకుంటోందని.. చౌహాన్ కుటుంబాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ ఆ ప్రకటనలో పేర్కొంది. అంతేగాక చౌహాన్ కుటుంబ అధికారిక నివాసాల్లో డబ్బు లెక్కింపు యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారని, కుటుంబంలోని సభ్యులకు నిబంధనలకు వ్యతిరేకంగా కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని ఆ ప్రకటనలో కాంగ్రెస్ ఆరోపించింది.
ఏదైతే తమ పరువుకు భంగం కలిగించేలా కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసిందో... అదే పరిమాణంలో ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నామని చెబుతూ మరో ప్రకటనను కాంగ్రెస్ విడుదల చేయాలని చౌహాన్ దంపతలు కోరారు. లేని పక్షంలో తమ పరువుకు భంగం కలిగించిందుకు 10 కోట్ల రూపాయలు చెల్లించాలని చౌహాన్ తమ నోటీసు(పరువునష్టం దావా)లో వారు పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కాంతిలాల్ భూరియాకు కూడా ఈ నోటీసును పంపించారు. తమ పరువుకు భంగం కలిగించేలా, కీర్తికి భంగం కలిగించేలా కాంగ్రెస్ విడుదల చేసిన ఆ ప్రకటన ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, అతని భార్య సాధ్నా సింగ్లు వారి నోటీసులో పేర్కొన్నారు.