బాడీగార్డ్ చెంప చెళ్లుమనిపించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ విమర్శలు
భోపాల్: ఓ పబ్లిక్ ర్యాలీ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహనం కోల్పోయారు. తనకు భద్రతగా ఉన్న ఓ బాడీగార్డ్ పైన చేయి చేయిచేసుకున్నారు. ఈ వ్యవహారం అంతా కెమెరాలకు చిక్కింది. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
సర్దార్ పూర్ టౌన్లో ఈనెలాఖరులో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చౌహాన్ మంగళవారం పాల్గొన్నారు. ఆయన ముందుకు నడుచుకుంటూ వెళ్తూ అకస్మాత్తుగా తన పక్కనే ఉన్న అధికారి చెంపపై కొట్టారు. అయితే ఆ తర్వాత ఏమీ జరగనట్టుగానే ఆయన తాపీగా ముందుకు కదిలారు.
కాగా, సదరు భద్రతాధికారి పదేపదే తన మోచేతిన తగిలిస్తుండటం చౌహాన్కు ఆగ్రహం తెప్పించిందని కొందరు ప్రత్యక్ష సాక్షుల కథనం. అయితే విపక్ష కాంగ్రెస్ మాత్రం శివరాజ్ సింగ్ చౌహాన్ తీరును ఎండగట్టింది.
ఓ పోలీసును ముఖ్యమంత్రి చెంపదెబ్బ కొట్టారని, పబ్లిక్ సర్వెంట్పై చేయి చేసుకున్నందుకు ఆయనపై ఎందుకు కేసుపెట్టకూడదని అని కాంగ్రెస్ ప్రతినిధి పంకజ్ చతుర్వేది ఓ ట్వీట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఆ ఒత్తిడితోనే సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకున్నారంటూ చతుర్వేది విమర్శించారు.
కాంగ్రెస్కు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేకే ముఖ్యమంత్రి, బీజేపీ కార్యకర్తలు పోలీసు జవాన్లపై బాహాటంగానే దాడులు చేస్తున్నారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ అరుణ్ యాదవ్ మరో ట్వీట్ చేశారు.