మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణం
భోపాల్: అసెంబ్లీలో తగిన బలం లేకపోవడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా కమల్ నాథ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ సిద్ధమయ్యారు. సీఎంగా ప్రమాణం చేశారు.
సోమవారం రాత్రి 7 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా బలం నిరూపించుకోలేక కమల్ నాథ్ రాజీనామా చేయడం, తమ పదవులకు రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం శివరాజ్ సింగ్కు కలిసివచ్చింది.
సోమవారం సాయంత్రం బీజేపీ నేతల కీలక సమావేశం జరగింది. ఈ భేటీలో సీఎం అభ్యర్థిగా శివరాజ్ సింగ్ ను పార్టీ నేతలు ఎన్నుకున్నారు. రాత్రి 7 గంటలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి ప్రమాణం చేశారు. మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రా, కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ చౌహాన్ కు వారు పోటీగా నిలబడలేరని తెలుస్తోంది.
ఇటీవలే కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. సింధియాకు మద్దతుగా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమపదవులకు రాజీనామా చేసి, వారు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో బలం లేకుండా పోయింది.