మహారాష్ట్రలో శివసేనకు తగ్గుతున్న ఆదరణ,బీజేపీ డామినేట్ చేస్తుందా..?
ముంబై: మహారాష్ట్రలో జస్ట్ ఎన్నికల కంటే ముందు బీజేపీపై నిప్పులు చెరిగిన శివసేన పార్టీ ఆ తర్వాత అదే బీజేపీతో పొత్తుపెట్టుకుంది. ఈ సారి శివసేన ఎన్నికల్లో ప్రదర్శన అంత బాగోలేదని ఎగ్జిట్ ఫలితాలు చెబుతున్నాయి. బీజేపీ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ... ఆ పార్టీకంటే తక్కువ సీట్లలో విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
శివసేనకు తగ్గుతున్న ఆదరణ
మహారాష్ట్రలో ఈక్వేషన్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. 2014లో ఎలాగైతే శివసేన బీజేపీలు పొత్తుతో పోటీ చేశాయో... ఈ సారి కూడా రెండు పార్టీలు కలిసే పోటీచేశాయి. అయితే ఈ సారి శివసేనకు అనుకున్న సీట్లు వచ్చేలా కనిపించడం లేదని ఎగ్జిట్ ఫలితాలు అంచనా వేస్తున్నాయి. ఇక పచ్చిగా చెప్పాలంటే శివసేన కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు సాధించే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు తెలియజేస్తున్నాయి. 25 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 20 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఎగ్జిట్ ఫలితాలు చెబుతుండగా శివసేన తాను పోటీ చేసిన 23 స్థానాల్లో 14 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. అంతేకాదు శివసేన ఓటు శాతంలో కూడా క్షీణత కనిపించిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
శివసేన కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు..?
ఇక రిపబ్లిక్ టీవీ జన్కీబాత్ ఎగ్జిట్ ఫలితాల్లో బీజేపీ 21 స్థానాలు గెలుస్తుందని శివసేన 17 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేశాయి. సకల్-సామ్ అనే మరో ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 19 స్థానాలు కట్టబెట్టగా శివసేనకు 10 స్థానాలు మాత్రమే ఇచ్చింది. ఇక మరో ప్రముఖ సంస్థ ఏబీపీ నీల్సన్ సర్వే మాత్రం బీజేపీకి 17 స్థానాలు, శివసేనకు 17 స్థానాలు ఇచ్చింది. 2014లో బీజేపీ 23 సీట్లు గెలువగా.. శివసేన 18 సీట్లు గెలిచింది. ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాకంటే ఎక్కువ సీట్లే శివసేన సాధిస్తుందన్న నమ్మకాన్ని ఓ పార్టీ సీనియర్ నేత వ్యక్తం చేశారు. బీజేపీతో తమకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయని ఎక్కడే కానీ అసంతృప్తి లేదని తెలిపారు.
గత 15 ఏళ్లుగా తగ్గుతున్న శివసేన ప్రాభవం
ఇదిలా ఉంటే బీజేపీ శివసేనల స్నేహం ఈనాటిది కాదు. 1989లో తొలిసారిగా రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఏర్పడ్డాయి.అయితే గత 15 ఏళ్లుగా బీజేపీ క్రమంగా ఆ రాష్ట్రంలో పుంజుకుంటూ వస్తోంది. దీంతో ఒక్కసారిగా డిఫెన్స్లోకి పడిపోయింది శివసేన.ఇక గత 15 ఏళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కంటే బీజేపీ ప్రదర్శనే బాగా కనిపిస్తుండటంతో ఆ పార్టీలో కాస్త కలవరం మొదలైంది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 49 శాతం సీట్లు గెలువగా.. శివసేన 39 శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగగా.. బీజేపీ 47.5 శాతం సీట్లు పొందగా శివసేనకు 22శాతం సీట్లు మాత్రమే వచ్చాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 24 సీట్లలో పోటీచేయగా 23 సీట్లలో విజయం సాధించింది.20 సీట్లలో కంటెస్ట్ చేసిన శివసేన 18 స్థానాల్లో గెలుపొందింది.
మొత్తానికి శివసేన సీట్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. త్వరలో బీజేపీ డామినేషన్తో ఏమైనా జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.