ఫిర్యాదు చేస్తే కాళ్లు నొక్కించుకున్న పోలీస్ అధికారి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మరో సారి అమానుషంగా ప్రవర్తించారు. ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన వ్యక్తికి కాళ్లు నొక్కాలని చెప్పాడు. చివరికి ఆ పోలీసు అధికారి ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన ఆ వ్యక్తి దగ్గర కాళ్లు నొక్కించుకుంటూ మొబైల్ లో దర్జాగా మాట్లాడుతూ కెమెరాకు చిక్కిపోయాడు.
ఉత్తర్ ప్రదేశ్ లోని మోహన్ లాల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పోలీస్ స్టేషన్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా (ఎస్ హెచ్ఓ) రామ్ యాగ్య యాదవ్ ఉద్యోగం చేస్తున్నారు.
శుక్రవారం ఓ సమస్యతో స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తి ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. రామ్ యాగ్య యాదవ్ కు విషయం చెప్పాడు. సమస్య తెలుసుకున్న పోలీసు అధికారి యాదవ్ ఎఫ్ ఐఆర్ నమోదు చెయ్యాలంటే నా కాళ్లు నొక్కాలని చెప్పాడు.
మొదట పోలీసు అధికారి జోక్ చేస్తున్నారని అతను అనుకున్నాడు. తరువాత కుర్చిలో కుర్చున్న యాదవ్ బాధితుడిని కింద కుర్చోపెట్టుకుని అతని దగ్గర కాళ్లు నొక్కించుకున్నాడు. అదే స్టేషన్ లో ఉన్న సాటి ఉద్యోగులు విస్తు పోయారు.
బాధితుడితో కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. విషయం తెలుసుకున్న జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మంజిల్ సైనీ వెంటనే స్టేషన్ అధికారి యాదవ్ ను సస్పెండ్ చేస్తూ విచారణకు ఆదేశించారు. బాధితుడిని పిలిపించి వివరాలు సేకరించారు.