దినకరన్ వర్గానికి షాక్: 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సమర్థించిన మద్రాస్ హైకోర్టు
చెన్నై: తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. దినకరన్ వర్గం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడాన్ని హైకోర్టు సమర్థించింది. దీంతో దినకరన్ వర్గం షాక్కు గురైంది. తీర్పు వచ్చే వరకు వారు రిసార్ట్లో ఉండాలని భావించారు. ఈ తీర్పు రాగానే ఒక్కసారిగా వారంతా షాక్కు గురయ్యారు. ఇక మద్రాస్ హైకోర్టు తీర్పుతో పళని స్వామి ప్రభుత్వానికి ముప్పు తప్పింది.
మద్రాస్ హైకోర్టు తీర్పుతో పిక్చర్ ఎలా ఉండబోతోంది..?
దినకరన్ వర్గానికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చిన నేపథ్యంలో ఇక ఆ 18 స్థానాలకు ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంది. ఇది అన్నాడీఎంకే ప్రభుత్వానికి ఒక రకంగా పెద్ద పరీక్షే అని చెప్పాలి. దివంగత నేత జయలలిత మృతి తర్వాత ప్రభుత్వంలో స్థిరత్వం కోల్పోయింది. అంతేకాదు ఆర్కే నగర్కు జరిగిన ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీటీవీ దినకరన్ పోటీచేసి గెలుపొందారు. ఇక అప్పటి నుంచి దినకరన్ అన్నాడీఎంకే పార్టీకి ప్రమాదంగానే మారారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉంది.
పళని ప్రభుత్వాన్ని పడగొట్టడమే టార్గెట్
ఇక మొదటినుంచి పళని సర్కార్ను పడగొట్టాలని ప్రయత్నిస్తున్న దినకరన్కు ఇది గట్టి షాక్ అనే చెప్పాలి. తన వర్గం ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలోనే ఉంటూ బలపరీక్షలో పళని స్వామికి వ్యతిరేకంగా ఓటు వేసి ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచనతో ఉన్న వీరికి హైకోర్టు తీర్పుతో బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే ఎన్నికలకు వెళ్లడం తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పిన దినకరన్... ఈ విషయాన్ని తమ వర్గం ఎమ్మెల్యేలతో చర్చించాకే నిర్ణయిస్తామని చెప్పారు. అయితే ఈపీఎస్ ఓపీఎస్లతో కలుస్తారా అన్న ప్రశ్నకు... అది ఎప్పటికీ జరగదనే సమాధానం చెప్పారు. మరోవైపు హైకోర్టు తీర్పు కుట్రదారులకు చెంపపెట్టులాంటిదని అన్నాడీఎంకే వ్యాఖ్యానించింది.
కేసులో మూడో జడ్జిగా జస్టిస్ సత్యనారాయణను నియమించిన సుప్రీం
అనర్హత పిటిషన్ను జస్టిస్ సత్యనారాయణ విచారణ చేసి తీర్పును వెల్లడించారు. అంతకుముందు మద్రాస్ హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ హులువాడి జి.రమేష్ కేసులో మూడో జడ్జిగా జస్టిస్ విమలను నియమించారు. అయితే ఆమె నియామకాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు. దీంతో సుప్రీంకోర్టు జస్టిస్ సత్యనారాయణను మూడో జడ్జిగా నియమించింది. ఇదిలా ఉంటే జూన్ 14న ఈకేసును ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. ఇద్దరు జడ్జీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఆ సమయంలో నాటి ఛీఫ్ జస్టిస్గా ఉన్న ఇంద్రా బెనర్జీ స్పీకర్ నిర్ణయాన్ని సమర్థించగా మరో జడ్జి జస్టిస్ సుందర్ ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ పేర్కొన్నారు.