బేర్ బజార్ : సెన్సెక్స్ 729..నిఫ్టీ 225 పాయింట్లు... నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. ఉదయం ప్రారంభం కావడమే నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే వరకు నష్టాల్లోనే పయనించాయి. ఏ దశలోను లాభాల వైపు మొగ్గలేదు. ఉదయం ట్రేడింగ్ సమయంలో 1000 పాయింట్లకు పైగా సెన్సెక్స్ కోల్పోయింది. ఆ తర్వాత కొంత కోలుకున్న మార్కెట్లు చివరకు 759 పాయింట్ల నష్టంతో 34001 వద్ద ముగిసింది. నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి 10వేల234 వద్ద ముగిసింది.
అమెరికా ఈక్విటీలు పతనం అవడంతో అదే క్రమంలో ఆసియా మార్కెట్లు కూడా పయనించాయి. ఇక అమెరికా వడ్డీ రేట్లు పెరిగిపోవడం, అమెరికా చైనాల మధ్య వాణిజ్యయుద్ధం నెలకొనడం ఆ ప్రభావం మార్కెట్లపై పడినట్లు నిపుణులు విశ్లేషించారు. మరోవైపు స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ విపరీత స్థాయిలో ఉన్నాయని అంతర్జాతీయ మోనిటరీ ఫండ్ అధినేత్రి క్రిస్టీన్ లగార్డే చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపి ఉంటాయని అనలిస్టులు చెబుతున్నారు. మొత్తానికి మార్కెట్లు కుప్పకూలడంతో 3లక్షల కోట్ల మేరా పెట్టుబడి దారుల డబ్బులకు నష్టం వాటిల్లింది.
ఇక బీఎస్సీ సెన్సెక్స్లో లాభాలు ఆర్జించిన వాటిలో ఎంఎంటీసీ లిమిటెడ్ (18.43) హిందుస్థాన్ పెట్రోలియం (14.70), మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ (10.58), హెచ్ఈజీ లిమిటెడ్ (9.37), హిందుస్థాన్ కాపర్(8.08) ఉండగా... నష్టాలు చవిచూసిన వాటిలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్ (11.54), ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (10.89), ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (10.78), ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (8.70), జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్ (8.55)ఉన్నాయి.