అధికారులకు షాక్ : ఆసుపత్రి నుంచి ఐదుగురు ఖైదీల పరారీ, ఒకరు మరణశిక్ష ఖైదీ
బీహార్ లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు.
బక్సర్: బీహార్ లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పరారైన ఖైదీలు అందరూ ఆరోగ్యం సరిగా లేని కారణంగా జైలులోని ఆసుపత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్నవారు.
ఐదుగురు ఖైదీలు ఆసుపత్రిలోని బాత్రూం అద్దాలను పగలగొట్టి, అందులోంచి దూరి పారిపోయినట్లు జైలు అధికారులు చెబుతున్నారు. పరారైన ఐదుగురిలో ఒకరు మరణశిక్ష విధింపబడిన ఖైదీ కాగా, మరో నలుగురు వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు.
పరారైన ఐదుగురు ఖైదీల పేర్లను అధికారులు వెల్లడించారు. బక్సర్ సెంట్రల్ జైలు అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం వీరి పేర్లు.. ప్రదీప్ సింగ్, దియోదరి రాయ్, సోను పాండే, ఉపేందర్ సహ, సోను సింగ్.
మరోవైపు పారిపోయిన ఈ ఖైదీలను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ఉద్ధృతం చేసినట్లు బక్సర్ సెంట్రల్ జైలు అధికారులు చెబుతున్నప్పటికీ... ఖైదీల ఆచూకీ మాత్రం దొరకలేదని సమాచారం.