పన్నీర్సెల్వంకు షాకిచ్చిన రెబల్ ఎమ్మెల్యే.. ఓపీఎస్ వర్గంలో గుబులు
అన్నాడీఎంకేలో చిన్నమ్మ శశికళ ఆధిపత్యాన్ని సహించలేక వేరుకుంపటి పెట్టిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంకు మద్ధతుగా పార్టీ నుంచి తొలుత బయటకు వచ్చిన రెబల్ ఎమ్మెల్యే వీసీ ఆరుకుట్టి.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత పార్టీలో చిన్నమ్మ శశికళ ఆధిపత్యాన్ని సహించలేక వేరుకుంపటి పెట్టిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంకు మద్ధతుగా పార్టీ నుంచి తొలుత బయటకు వచ్చిన రెబల్ ఎమ్మెల్యే వీసీ ఆరుకుట్టి... ఇప్పుడు ఓపీఎస్ వర్గానికి ఝలక్ ఇస్తూ సొంత గూటికి చేరారు.
కోయంబత్తూరు గౌండంపాళయం శాసనసభ్యులైన ఆరుకుట్టి ఆదివారం ఉదయం సేలంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సమక్షంలో అధికార అన్నాడీఎంకే (అమ్మ) పార్టీలో చేరారు. సీఎం ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి శాలువతో సత్కరించారు.
సీఎం పళనిస్వామి సమక్షంలో...
ఎంజీఆర్ శతజయంతి వేడుకల నిమిత్తం సేలం వెళ్లిన సీఎం ఎడప్పాడి అక్కడే ఆరుకుట్టిని పార్టీలో చేర్చుకున్నారు. ఓపీఎస్ వర్గంలో ప్రాధాన్యత తగ్గడంతోనే ఆరుకుట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే ఈ నెల 29న కోవైలో ఓపీఎస్ వర్గం తరపున నిర్వహించబోతున్న ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా ఆయన్ని ఆహ్వానించలేదట.
తగిన ప్రాధాన్యం లభించలేదు, అందుకే..
సీఎం సమక్షంలో సొంత గూటికి చేరిన ఆరుకుట్టి పాత్రికేయులతో మాట్లాడుతూ... శశికళను ఎదిరించి బయటకు వచ్చిన ఓపీఎస్కు మద్ధతు పలికిన తొలి వ్యక్తిని తానేనని, అయితే తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ఎవరి ప్రోద్బలం లేకుండా తనంతట తానుగానే ఎడప్పాడి వర్గంలో చేరానని ప్రకటించారు. తన నియోజకవర్గం ప్రజల అభిప్రాయం మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, తన నియోజకవర్గం సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడటం పన్నీర్సెల్వం వర్గం నాయకులకు కంటగింపుగా మారిందన్నారు. తన నియోజకవర్గం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే మళ్లీ తన మాతృసంస్థలోకి తిరిగి వచ్చానని ఆయన చెప్పారు.
Recommended Video
విలీనం ప్రజల కోరిక, కానీ...
జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడం తెలిసిందే. మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం, శశికళ విధేయుడైన ప్రస్తుత సీఎం పళనిస్వామి వర్గం తిరిగి విలీనం అయ్యేందుకు ప్రయత్నాలు జరిగినా చివరికి ఇరు వర్గాల విలీనం అనేది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. పన్నీర్సెల్వం వర్గీయులను తాను తప్పుబట్టడం లేదని, రెండు వర్గాలు విలీనం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నా ఆ వర్గం పట్టించుకోవడం లేదని తాజాగా వీసీ ఆరుకుట్టి ఆరోపించారు. ఈ విషయమై పన్నీర్ సెల్వం వర్గంలోని పలువురు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తనలాగే ఆ వర్గంలోని మిగిలిన శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి మద్దతునిస్తే సంతోషపడతానని ఆయన పేర్కొన్నారు.
ఓపీఎస్ వర్గం అత్యవసర సమావేశం...
ఎమ్మెల్యే ఆరుకుట్టి రివర్స్గేర్ ఓపీఎస్ వర్గంలో గుబులు పుట్టిస్తోంది. ఈపీఎస్ వర్గంలో ఆరుకుట్టి చేరిన వెంటనే ఓపీఎస్ వర్గం నేతలు అత్యవసరంగా సమావేశయ్యారు. ఆరుకుట్టి బాటలో మిగతా ఎమ్మెల్యేలు కూడా పయనించకుండా ఉండేందుకు బుజ్జగింపు పర్వానికి తెరతీసినట్టు తెలుస్తోంది. అయితే పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తమ వర్గం నుంచి శాసనసభ్యుడు ఆరుకుట్టి అధికార అన్నాడీఎంకేలో చేరటం వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం జరుగదని పన్నీర్సెల్వం వర్గం నాయకుడు, మాజీ మంత్రి కేపీ మునుసామి అన్నారు.
విలీనం సమస్యే లేదు: మునుస్వామి
తమ వర్గంలో మొట్టమొదట చేరింది ఆరుకుట్టి మాత్రమేనని, స్వీయ ప్రయోజనాల కోసం ఆయన మళ్లీ అధికార పార్టీకి వెళ్లారని, అంతమాత్రాన తమ పార్టీకి ఎలాంటి నష్టం కలుగదని, రాష్ట్ర ప్రజల మద్దతు తమ వర్గానికే ఉందని వ్యాఖ్యానించారు పన్నీర్సెల్వం వర్గం నాయకుడు, మాజీ మంత్రి కేపీ మునుసామి. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు వర్గాల విలీనం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. కాగా, భారత నూతన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఓపీఎస్ న్యూఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోడీతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది.