మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలకు షాక్.. రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్యేలు
ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్,దాని మిత్రపక్షాలకు నలుగురు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఏడాది చివరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్న వేళ కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఉదయం అసెంబ్లీలో స్పీకర్ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు సమర్పించారు. వారిలో ముగ్గురు ఎన్సీపీకి చెందిన వారు కాగా.. ఒకరు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధి ఉన్నారు.
50 మంది కాంగ్రెస్ - ఎన్సీపీ నేతలు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ నేతలు ప్రకటించిన మరుసటి రోజు జరిగిన పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారంతా బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. స్పీకర్కు రాజీనామా సమర్పించిన వారిలో ఎన్సీపీ సతారా ఎమ్మెల్యే శివేంద్రసిన్హరజే భోంస్లే, అకోలా ఎమ్మెల్యే వైభవ్ పిచాడ్, ఐరోలీ ఎమ్మెల్యే సందీప్ నాయక్తో పాటు నైగావ్ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోలంబ్కర్ ఉన్నారు.
నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ హరిభావు బగాడేను విడివిడిగా కలిసి తమ రాజీనామాలు సమర్పించారు. తన అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు భోంస్లే చెప్పారు. ఇదిలా ఉంటే ముంబై నియోజకవర్గం నుంచి కోల్బకర్ ఏడు సార్లు గెలిచారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఎన్సీపీ ముంబై చీఫ్ సచిన్ అహిర్ గత వారమే శివసేనలో చేశారు. తాజాగా మరో ముగ్గురు పార్టీని వీడుతుండటంతో ఎన్సీపీ పరిస్థితి దారుణంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ నేత సైతం బీజేపీ వైపు చూస్తుండటంతో వలసలను అడ్డుకునేందుకు ఏం చేయాలో తెలియక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.