ఎన్డీయేకు నితీష్ కుమార్ స్ట్రోక్: బీహార్లో అది అమలు చేయమన్న సీఎం
బీహార్ : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు భారీ షాక్ ఇచ్చారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని ఓ వైపు కేంద్రం చెబుతుండగా...దాన్ని బీజేపీయేతర రాష్ట్ర ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారు. అయితే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జేడీయూ పార్టీ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ బీహార్లో ఎన్ఆర్సీ అమలు ఉండదని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై కూడా ప్రారంభంలో వ్యతిరేక గళం వినిపించిన అతిపెద్ద మిత్రపక్షంగా కూడా జేడీయూ నిలిచింది.
సమాధానాలు కాదు.. పరిష్కారం కావాలి... పిల్లల మరణాలపై సీఎం నితీష్ కుమార్కు సుప్రిం అంక్షింతలు..
పౌరసత్వ సవరణ చట్టంను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ వ్యతిరేకించిన నేపథ్యంలో త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసకుంటామని డిసెంబర్ 14న సీఎం నితీష్ కుమార్ చెప్పారు. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్కు హామీ ఇచ్చినట్లు సమాచారం. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు ఎన్ఆర్సీని కూడా వ్యతిరేకిస్తూ ప్రశాంత్ కిషోర్ వరుస ట్వీట్లు చేశాడు. గురువారం రోజున కూడా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు.
ఇక పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటులో చివరినిమిషంలో జేడీయూ మద్దతు తెలపడంపై సీఎం నితీష్ కుమార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మైనార్టీలకు ఎలాంటి హాని జరగదని ఇందుకు తనది బాధ్యత అని సీఎం నితీష్ కుమార్ గురువారం చెప్పారు.తమ ప్రభుత్వం ఉన్నంత వరకు ముస్లింలకు తాను భరోసాగా ఉంటానని నితీష్ కుమార్ హామీ ఇచ్చారు.
మైనార్టీల సాధికారిత కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పుకొచ్చారు నితీష్ కుమార్. అంతకుముందు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నమ్మించి మోసం చేశాయని మండిపడ్డారు. వారి హయాంలో మైనార్టీల కోసం ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు నితీష్ కుమార్. కొందరు లాభసాటిగా ఉంటేనే ఏదైనా చేస్తారని చెప్పిన నితీష్ కుమార్... తాము అన్ని సామాజిక వర్గాల వారికి సమన్యాయం చేస్తున్నామని వెల్లడించారు. ముస్లింలకు బీహార్లో ఎలాంటి అన్యాయం జరగదని గ్యారెంటీ ఇచ్చారు నితీష్ కుమార్.