రైల్వే ప్రయాణికులకు షాక్.. టికెట్ల ధరలు భారీగా పెంపు... మూడింతలు పెరిగిన ఛార్జీలు
దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.30కి పెంచుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇకపై లోకల్ ట్రైన్లలో కనీస ఛార్జీని రూ.30గా నిర్ణయించింది. అసలే దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ రేట్లు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఇది మరో షాక్ అనే చెప్పాలి. అయితే దీనిపై కేంద్రం వాదన మాత్రం మరోలా ఉంది.
పెరిగిన ప్లాట్ఫామ్ టికెట్ ధరలు తాత్కాలికమేనని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్లాట్ఫామ్ టికెట్ల ధరల మార్పు నిర్ణయాధికారాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్లకు అప్పగించినట్లు పేర్కొంది. ఇలా ధరలు పెంచడం ఇప్పుడే తొలిసారేమీ కాదని.. గతంలోనూ ఇలాంటి విధానాలను అవలంభించామని రైల్వే శాఖ వెల్లడించింది.
కాగా,హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇప్పటికీ లోకల్ ట్రైన్లు ప్రారంభం కాలేదు. ముంబైలో ఇప్పటికే లోకల్,సబర్బన్ రైళ్లు నడుస్తున్నాయి. కనీస ఛార్జీలను కూడా పెంచడంతో రైలు ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది.
అంతకుముందు,ఈ ఏడాది జనవరిలో సబర్బన్ రైళ్లు మినహా మిగతా ప్యాసింజర్ రైళ్లలో టికెట్ ఛార్జీలను రైల్వే శాఖ పెంచిన విషయం తెలిసిందే. ఎక్స్ప్రెస్ రైళ్లలో కి.మీకి 2 పైసలు, ఏసీ కోచ్లో ప్రయాణానికి కి.మీకి 4 పైసలు చొప్పున ఛార్జీలను పెంచింది. శతాబ్ది,రాజధాని,దురొంతో వంటి ప్రీమియం రైళ్లకు కూడా ఈ ఛార్జీలను వర్తింపజేసింది.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో గతేడాది మార్చి 15న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైలు సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు,మూడు నెలలకు దశలవారీగా కొన్ని స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికీ అవే స్పెషల్ ట్రైన్లు నడుస్తున్నాయి. అయితే థియేటర్లు,బార్లు,క్లబ్బులు,పార్కులు,ఇలా అన్నింటికీ అనుమతినిచ్చిన కేంద్రం... రైళ్లను మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఎందుకు నడపట్లేదని ప్రశ్నించేవారు లేకపోలేదు.