రాందేవ్ బాబా పతంజలికి షాక్ .. కరోనిల్ పై కేసు విచారణ .. మద్రాస్ హైకోర్టు భారీ జరిమానా!!
ఆధ్యాత్మిక మరియు యోగా గురువు రాందేవ్ బాబా పతంజలి కర్నూల్ ఆయుర్వేద మెడిసిన్ తయారీతో అష్ట కష్టాలను ఎదుర్కొంటోంది. కరోనిల్ పేరుతో తయారు చేసిన ఆయుర్వేదిక్ మెడిసిన్ కు సంబంధించి ఫైల్ అయిన కేసులో తాజాగా మద్రాస్ హైకోర్టు పతంజలి కి భారీ జరిమానా విధించింది.
Recommended Video
రామ మందిర నిర్మాణమే రామరాజ్య స్థాపనకు నాంది .. అయోధ్యలో రాందేవ్ బాబాతో సహా పలువురు స్వామీజీల హర్షం
పతంజలి కరోనిల్ మెడిసిన్ కు ఆది నుండీ అడ్డంకులే
కరోనా నివారణ కోసం కరోనిల్ మెడిసిన్ తయారు చేశామని మొదటి ప్రచారం చేసుకున్న పతంజలికి ఆయుష్ శాఖ షాక్ ఇచ్చింది. ఎవరి అనుమతులతో కరోనా మందు తయారు చేశారో చెప్పాలని, కరోనిల్ మెడిసిన్ కు సంబంధించి క్లారిటీ ఇవ్వాలని నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. దీంతో ఆ వివాదం నుండి బయటపడడానికి పతంజలి నానా తంటాలు పడాల్సి వచ్చింది.
మద్రాస్ హైకోర్టులో పతంజలి కరోనిల్ పై పిటీషన్
ప్రస్తుతం పతంజలి మరో వివాదంలో చిక్కుకోవడమే కాకుండా ఏకంగా భారీ జరిమానా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే పతంజలి తయారు చేసిన కరోనిల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరోనిల్ అనే బ్రాండ్ పేరు తమదే అని, తాము రిజిస్టర్ చేయించుకున్నామని చెన్నైకు చెందిన అర్దురా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తమ బ్రాండ్ నేమ్ పతంజలి వాడుకుందని కోర్టుకెక్కిన చెన్నై సంస్థ .. విచారణ
ఈ సంస్థ 1993లోనే కరోనిల్ బ్రాండ్ ను రిజిస్టర్ చేసుకున్నామని, 2027 వరకు ఆ బ్రాండ్ నేమ్ ను ఎవరు వాడుకోవడానికి వీలులేదని పేర్కొంది. కానీ పతంజలి సంస్థ తమ పేరును వాడుకుందని ఆ పిటిషన్ లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు రిజిస్టర్ బ్రాండ్ నేమ్ వేరే సంస్థకు ఉండగా, పతంజలి సంస్థ ఎలా వాడుకుంటుందని ప్రశ్నించింది. వెంటనే కరోనిల్ పేరును తొలగించాలని పతంజలి సంస్థను ఆదేశించింది.
కరోనిల్ పేరు తొలగించాలని కోర్టు ఆదేశం .. పతంజలికి 10 లక్షల రూపాయల జరిమానా
అంతే కాదు కరోనిల్ మెడిసిన్ కరోనా వైరస్ ను నివారిస్తుందని ప్రచారం చేసుకున్నందుకుగాను, ప్రజలలో ప్రస్తుతం కరోనా విషయంలో ఉన్న భయాన్ని తమ కరోనిల్ మెడిసిన్ ద్వారా క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నం చేశారని పతంజలి సంస్థకు 10 లక్షల రూపాయల జరిమానా విధించింది మద్రాస్ హైకోర్టు. జరిమానా మొత్తాన్ని అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ మరియు అరుంబక్కంలోని ప్రభుత్వ యోగా, నేచురోపతి మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ లకు ఆగస్టు 21 లోగా విభజించి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు తీర్పుతో తలపట్టుకున్న పతంజలి
ఇప్పటికే ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కొని పతంజలి సంస్థ తయారు చేసిన కరోనిల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ మార్కెట్లోకి వచ్చింది . ఈ సమయంలో పేరును తొలగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పతంజలి సంస్థ తలపట్టుకుంది. మరి ఈ వ్యవహారంలో కోర్టు తీర్పు నేపధ్యంలో పతంజలి సంస్థ ఏమి చెయ్యనుందో అన్నది ఆసక్తికరంగా మారింది.